Saudi Arabia: ప్రపంచంలో ఒక దేశం సుసంపన్నంగా మారాలంటే వ్యవసాయం, పుష్కలమైన జలవనరులు, జీవనదులు ఉండటం అత్యంత ముఖ్యం. కానీ, సువిశాలమైన భూభాగంలో ప్రవహించేందుకు కనీసం ఒక్క సహజ నది కూడా లేని ఒక దేశం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలనే శాసిస్తోందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆ దేశమే సౌదీ అరేబియా. అరబ్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన సౌదీ, చమురు నిల్వలతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాలలో ఒకటిగా ఎదిగి ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే మరో సాహసోపేత యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. 95 శాతానికి పైగా ఇసుక తిన్నెలతో నిండిన ఎడారి దేశాన్ని పచ్చని నందనవనంగా మార్చేందుకు ఏకంగా 1000 కోట్ల మొక్కలు నాటేందుకు రెడీ అయ్యింది.
నదులు లేని నేలపై నీటి అద్భుతం
అరేబియా ద్వీపకల్పంలో దాదాపు 21.49 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో విస్తరించి ఉన్న సౌదీ అరేబియాలో శాశ్వత నదులుగానీ, సహజసిద్ధమైన మంచినీటి సరస్సులుగానీ ఎక్కడా కనిపించవు. మరి ఈ దేశం తన నీటి అవసరాలను ఎలా తీర్చుకుంటోంది, సముద్రపు ఉప్పు నీటిని అత్యాధునిక డీసాలినేషన్ పద్ధతుల ద్వారా స్వచ్ఛమైన తాగునీరుగా మార్చడంతో పాటు, భూగర్భ జలాలను వినియోగించుకుంటూ నదులు లేని లోటును సాంకేతిక పరిజ్ఞానంతో అధిగమించింది. చమురు నిల్వలపై ఆధారపడిన ఆర్థిక బలం, సంపద తోడవడంతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న రాజరిక దేశంగా నిలిచింది.
‘గ్రీన్ అరేబియా’ చారిత్రక సత్యం.. నేటి బృహత్తర ప్రాజెక్ట్
చరిత్ర పుటలను తిరగేస్తే ప్రాచీన కాలంలో ఈ ఎడారి భూమి పచ్చటి అడవులు, నదులతో కళకళలాడిందని, ఆఫ్రికా-యురేషియా మధ్య మానవ వలసలకు ఈ ప్రాంతం కీలక మార్గంగా విలసిల్లిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ పురాతన పచ్చదనాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలన్న సంకల్పంతో సౌదీ ప్రభుత్వం ‘సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్’ పేరుతో అద్భుత ప్రాజెక్టును చేపట్టింది. ఎడారి నేలపై ఏకంగా 1000 కోట్ల మొక్కలను నాటడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఇప్పటికే 15 కోట్లకు పైగా మొక్కలను నాటి సుమారు 5 లక్షల హెక్టార్ల భూమిని పునరుద్ధరించారు. నీటి కొరతను తట్టుకునే దేశీయ మొక్కల ఎంపిక, శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగం, డ్రోన్ల ద్వారా విత్తనాలు చల్లడం వంటి అత్యాధునిక విధానాలను అమలు చేస్తున్నారు. 2030 నాటికి 60 కోట్ల మొక్కలను నాటడం ద్వారా నగరాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను 2.2 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆధ్యాత్మిక వైభవం.. కొత్త దిశగా అడుగులు
ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన మక్కా, మదీనా నగరాలు కొలువై ఉన్న సౌదీ అరేబియాకు ఏటా ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది హజ్, ఉమ్రా యాత్రల కోసం తరలివస్తుంటారు. ప్రస్తుతం దేశం కేవలం పెట్రోలియం ఎగుమతులపైనే ఆధారపడకుండా సరికొత్త సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ, విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఆర్థిక వ్యవస్థను వైవిధ్యభరితంగా మారుస్తోంది. ఒక్క జీవనది కూడా లేని ఇసుక ఎడారిని సాంకేతికత, సంపద బలంతో పచ్చని ఒయాసిస్సుగా మార్చాలన్న సౌదీ అరేబియా ఆలోచన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

