PoK: పాకిస్తాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో భారీగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాశ్మీర్ శరణార్థులకు 12 అసెంబ్లీ స్థానాలను కేటాయించడంపై అక్కడి ప్రజలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం లేవనెత్తారు. ఈ నిర్ణయం ద్వారా పాక్ ప్రభుత్వం తమకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్లాన్ చేస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనలు ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారాయి.
ఇదిలా ఉంటే, ఈ ఆందోళనల్ని అడ్డుకోవడానికి, ఉద్యమకారుల్ని అణచివేయడానికి పాకిస్తాన్ అనాగరిక చర్యలకు దిగుతోంది. పాక్ ఇతర ప్రాంతాల నుంచి పీఓకేకు సరకులు వెళ్లకుండా దిగ్బంధనం చేసింది. దీంతో ఆహారం, మందుల కోసం పీఓకే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నిరసనల నేపథ్యంలో పీఓకేలోని ముజఫరాబాద్, రావలాకోట్, బాగ్, నీలం వ్యాలీ ప్రాంతాల్లో ఆహారం, మందులు, ఇంధనం కొరత తీవ్రంగా పెరిగింది. అనేక దుకాణాలు, మెడికల్ షాపులు మూతపడగా, ప్రజలు రోజువారీ అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పిండి, బియ్యం, పప్పులు, పెట్రోల్ వంటి నిత్యావసర వస్తువులు కూడా దొరకడం లేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
పాకిస్తాన్ నుంచి వస్తున్న సరుకుల్ని పీఓకేకు చేరకముందే చెక్పోస్టుల వద్ద అడ్డుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో చాలా మంది ట్రక్ డ్రైవర్లు ఆహార పదార్థాలు, నిత్యావసరాలతో వెళ్లున్న వాహనాలను నిలిపేస్తున్నారు. దీంతో సరఫరా వ్యవస్థ దెబ్బతింది. అయితే, ఈ ఆరోపణల్ని పాక్ అధికారులు ఖండిస్తున్నారు. అవసరమైన వస్తువుల రవాణాను అడ్డుకోవడం లేదని చెప్పారు. మరోవైపు, ఉద్యమం రోజురోజుకు బలపడుతోంది. రావల్ కోట్లో భారీ ధర్నాకు 70,000 మంది హాజరయ్యారు. అవసరమైతే లక్ష మందితో ముజఫరాబాద్కు మార్చ్ చేపడుతామని ఉద్యమ నేతలు హెచ్చరిస్తున్నారు.

