PM Modi: ‘పాలలో కరిగే చక్కెరలాంటోళ్లు’.. భారతీయులు మధురంగా ఉంటారన్న మోడీ

  • ‘పాలలో కరిగే చక్కెరలాంటోళ్లు’
  • భారతీయులు మధురంగా ఉంటారన్న మోడీ
  • మెల్‌బోర్న్ సభలో ప్రధాని మోడీ కీలక ప్రసంగం
Modi2

Modi2

భారతీయులు పాలలో కరిగే చక్కెరలాంటి వాళ్లు.. అది పాలను మరింత మధురంగా చేస్తోందని ప్రధాని మోడీ అన్నారు. మెల్‌బోర్న్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా భారతీయుల ఔనత్యాన్ని కొనియాడారు. భారతీయుల ప్రేమ మాధుర్యాన్ని ప్రపంచమంతటా పంచుతూనే ఉంటారని మోడీ కొనియాడారు. ‘ఇంట్లో పాలు ఆస్ట్రేలియన్ కావచ్చు.. కానీ టీ మాత్రం భారతీయమైనది.. పప్పులు, కూరగాయాలు ఆస్ట్రేలియావే అయినా.. వాటికి అసలైన భారతీయు మసాలాలతో తాలింపు పెడతాం’’ అని అన్నారు.

‘‘21వ శతాబ్దపు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యం దిశగా పయనిస్తోంది. ఒక కల నెరవేరినప్పుడు.. మరో కొత్త కల పుడుతుంది. ఒక దీపం వేలకొద్దీ దీపాలను వెలిగిస్తుందని పూర్వం అనేవారు. కానీ ఈ రోజు నేను ఒక కల మరో కలకు జన్మనిస్తుందని.. అలా వేలాది కలలు ఉద్భవిస్తాయని చెబుతున్నాను. ఒక లక్ష్యం నెరవేరినప్పుడు.. దాని స్థానంలో అంతకంటే గొప్ప సంకల్పం పుడుతుంది. మరింత ఎదగండి, మరింత సాధించండి అనే నినాదాన్ని విశ్వసించే భారతదేశం ఇది. మనం ఆశలు, ఆకాంక్షలతో నిండిన 140 కోట్ల జనాభా గల దేశం.. భారతదేశం.’’ అని అన్నారు.

‘‘మెల్‌బోర్న్‌ను కొందరు లిటిల్ ఇండియా అని.. మరికొందరు మినీ ఇండియా అని పిలుస్తారు. పేరు ఏదైనప్పటికీ, ఇది భారతీయ సంస్కృతిలో పూర్తిగా మునిగి ఉంది. ఒక మార్కెట్‌కు సంబంధించిన వీడియోను ఎవరో తనకు చూపించారని.. ఆ వీడియోలో అక్కడ నిరంతరం అమ్మకాలు జరుగుతున్నట్లు కనిపించింది. ఈ అమ్మకాల ఉత్సాహానికి ప్రజలు పూర్తిగా ఆకర్షితులవుతారు. వారికి షాపింగ్ చేయాలని అనిపించకపోయినా.. చివరికి ఏదో ఒకటి కొనేస్తారు.’’ అని పేర్కొన్నారు.