PAKISTAN: అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు వేదికగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ మారింది. యుద్ధం నిలిచేలా మధ్యవర్తిత్వాన్ని చేసింది. దీనికే ప్రపంచంలో ‘‘సూపర్ పవర్’’ అంటూ పాక్ ప్రభుత్వం, ఆ దేశ ప్రజల ముందు కలరింగ్ ఇచ్చింది. ఇస్లామాబాద్ టాక్స్ పేరిటి పాక్ వ్యాప్తంగా పోస్టర్లు, హోర్డింగ్లకు తెగ ఖర్చు చేసింది. తీరా ఇన్ని చేసి, చర్చలకు వేదిగా నిలిచిన హోటల్కు బిల్లులు మాత్రం చెల్లించలేకపోయింది. ఇది పాకిస్తాన్ మొత్తానికి అవమానకరం.
ఏప్రిల్ 10 నుంచి 12 వరకు ఇస్లామాబాద్లో జరిగిన అమెరికా-ఇరాన్ ఉన్నత స్థాయి శాంతి చర్చలకు సెరీనా హోటల్ వేదికగా నిలిచింది. రెండు దేశాలకు చెందిన ప్రతినిధులకు బస ఏర్పాటు చేసింది. అయితే, హోటల్ బిల్లులు చెల్లించడంలో మాత్రం విఫలమైంది. ఇది ఆ దేశ ఆర్థిక పరిస్థితిని సూచిస్తోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్లో 7-9 శాతం ద్రవ్యోల్బణం ఉంది. ఇక పాక్ విదేశీ మారక నిల్వలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. దీనికి తోడు యూఏఈ వంటి దేశాలు తమ అప్పును వెంటనే చెల్లించాలని పాకిస్తాన్కు అల్టిమేటం విధించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు హోటల్ బిల్లు చెల్లించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
అగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో సంబంధం ఉన్న హోటల్ యజమాని రంగంలోకి దిగి ఖర్చులను చెల్లించవలసి వచ్చింది. అప్పటి నుండి ఈ పరిణామం దౌత్య- విధాన వర్గాలలో తీవ్రమైన విమర్శలకు దారితీసింది. ఇలాంటి అంతర్జాతీయ ఈవెంట్కు ఆతిథ్యమిచ్చి, హోటల్ బిల్లులు చెల్లించకపోవడం పాక్ పరువు తీసింది.