దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. దేశంలోని విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో పాటు విపరీతమైన అప్పుల కారణంగా పాకిస్తాన్, మరో శ్రీలంకగా మారబోతోంది. శ్రీలంక పరిస్థితి రావడం ఖాయం కానీ.. ఎన్ని రోజుల్లో అనేదే తేలాలి. పాకిస్తాన్ ఈ ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకోవడానికి ఐఎంఎఫ్ సాయం కోరుతోంది.
ఇదిలా ఉంటే పాకిస్తాన్ లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్రమైన విద్యుత్ కోతలు నెలకొన్నాయి. విద్యుత్ ఉత్పత్తి కోసం పాక్ ఎక్కువగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్జి)పై ఆధారపడింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ ఎల్ఎన్జిని కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇంధన వనరులను ఆదా చేసేందుకు పాకిస్తాన్ విపరీతమైన కోతలు విధిస్తోంది. ఇప్పటికే కరెంట్ ను ఆదా చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు పనిగంటలను తగ్గించింది, కరాచీతో పాటు ఇతర నగరాల్లో షాపింగ్ మాల్స్, కర్మాగారాలు త్వరగా మూసివేయాలని ఆదేశించింది. మార్కెట్లు సాయంత్రం వరకే తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.
తీవ్రమైన కరెంట్ సంక్షోభాన్ని ఎదురుకొంటున్న పాకిస్తాన్ కు అక్కడి టెలికాం ఆపరేటర్లు వార్నింగ్ ఇచ్చారు. ఎక్కువ గంటలు విద్యుత్ అంతరాయం కారణంగా మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తామని.. అంతరాయం కారణంగా మొబైల్ నెట్వర్క్ కార్యకలాపాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డ్ (ఎన్ఐబీటీ) ట్విట్టర్ లో పేర్కొంది.
ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఖతార్ తో పాక్ చర్చలు జరుపుతోంది. ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ పెట్రోలియం మంత్రి ముసాదిక్ మాలిక్, ఖతార్ ఇంధన వ్యవహారాల సహాయ మంత్రి, ఖతార్ ఎనర్జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సాద్ అల్-కాబీతో దోహాలో భేటీ అయ్యారు. పాకిస్తాన్ ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు వేగంగా క్షీణించాయి. ద్రవ్యోల్భనం పెరిగింది. జూలైలో పాకిస్తాన్ లో రెండంకెల ద్రవ్యోల్భనం నమోదు అయింది.