26/11 ముంబై పేలుళ్ల సూత్రధారి సాజిద్ మీర్ను పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. సాజిద్ చనిపోయాడని పాక్ గతంలో ప్రకటించింది. కానీ చనిపోయాడనుకున్న సాజిద్ పాకిస్థాన్లో యథేచ్ఛగా తిరుగుతున్నాడు. సాజిద్ చనిపోలేదని ఐఎస్ఐ రక్షణలో స్వేచ్ఛగా జీవనం సాగిస్తున్నాడంటూ ఓ వార్తా సంస్థ సంచలన కథనాన్ని వెలువరించింది. ఇప్పుడీ వార్త తీవ్ర కలకలం రేపుతోంది. సాజిద్ చనిపోయాడని గతంలో ప్రకటించిన పాకిస్తాన్.. ఇప్పుడు అతన్ని అరెస్టు చేసినట్లు పేర్కొనడం మరింత చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక ఫైనాన్స్ వాచ్డాగ్ అయిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క “గ్రే లిస్ట్” నుండి బయటపడేందుకు పాకిస్తాన్ మీర్ను అరెస్టు చేసిందని నిక్కీ ఆసియా శుక్రవారం నివేదించింది. పాక్లోని రావల్పిండిలో జీవిస్తున్న సాజిద్.. మళ్లీ ఉగ్ర కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఉగ్రవాద విస్తరణకు సాజిద్ ప్రణాళికలు రచిస్తున్నాడు. మరోసారి ఉగ్రదాడులకు సాజిద్ పన్నాగం పన్నుతున్నాడన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈసారి ఆస్ట్రేలియా, వర్జినియా, అమెరికా, ఫ్రాన్స్లలో ఉగ్ర దాడులకు కుట్రలు చేస్తున్నట్టు సమాచారం.
మీర్ అరెస్టు గురించి ఢిల్లీకి రెండు నెలల క్రితమే తెలిసిందని.. కానీ పాకిస్తాన్ అరెస్టు గురించి అధికారిక బహిరంగ ప్రకటన లేదా న్యాయస్థానంలో అతనిని సమర్పించిన వివరాలు లేకపోవడంతో, భారత అధికారులు అరెస్ట్ను స్వతంత్రంగా ధృవీకరించలేకపోయారు. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ కంటే మీర్ ప్రమాదకరమని భారత ఏజెన్సీలు పేర్కొన్నాయి. ముంబై దాడికి మూడు సంవత్సరాల ముందు, హెడ్లీ వాంగ్మూలం ప్రకారం, మీర్ ఒకసారి ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ని చూడటానికి పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల సమూహాలతో వాఘా మీదుగా భారతదేశానికి చేరుకున్నాడు. అది కూడా నిఘా యాత్ర అని భారత అధికారులు భావిస్తున్నారు.
2002లో వర్జీనియాలో తుపాకులు, వైట్హౌస్ మ్యాప్లతో 11 మంది ఇస్లామిస్ట్ మిలిటెంట్లను ఎఫ్బీఐ అరెస్ట్ చేయడంతో మీర్ మొదటిసారిగా యూఎస్లోని భద్రతా అధికారుల దృష్టికి వచ్చాడు. లష్కరే ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ చీఫ్గా ఆయన పేరు విచారణ సమయంలో పరోక్షంగా తెరపైకి వచ్చింది. కొంతమంది భద్రతా నిపుణులు అతను పాకిస్తాన్ సైన్యం నుండి సైనిక శిక్షణ పొందిన పౌరుడని భావిస్తున్నారు. కొన్నాళ్లు పాకిస్థాన్ ఆర్మీలో ఉన్నాడని కొందరి అభిప్రాయం.
సాజిద్ బతికే ఉన్నా.. ముంబై పేలుళ్ల మరో సూత్రధారి మసూద్ అజార్ జాడ మాత్రం కరువైంది. మసూద్ బహవాల్పూర్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే మసూద్ జాడపై కచ్చితమైన సమాచారం మాత్రం లేదు. కాగా.. మోస్ట్ వాంటెడ్ సాజిద్ మీర్ కోసం భారత్, అమెరికా గత కొన్నేళ్లుగా కోసం వెతుకుతున్నాయి. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సాజిద్ మీర్కు సంబంధం ఉంది. మీర్ లష్కరే నాయకుడు హఫీజ్ మహ్మద్ సయీద్కు సన్నిహితుడు. అయితే.. డేవిడ్ కోల్మన్ హెడ్లీ సహా ఇతర ఉగ్రవాదులతో కలిసి సాజిద్ మీర్ ముంబైలో ఉగ్రదాడికి ప్లాన్ చేశాడు.
ఓవైపు పాకిస్థాన్పై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఆంక్షల కత్తి వేలాడుతోంది. ఇప్పటికీ పాకిస్థాన్ గ్రే లిస్టులోనే కొనసాగుతోంది. ఈ ఆంక్షల ఫలితంగా.. పాకిస్థాన్ అనేక అవరోధాలు ఎదుర్కొంటోంది. ప్రపంచ దేశాల్లో పాకిస్థాన్పై చులకనభావం ఏర్పడింది. దేశంలో ఉగ్ర కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తేనే.. గ్రే లిస్టు నుంచి తొలగిస్తామని స్పష్టంగా చెబుతోంది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. అయినప్పటికీ.. సాజిద్, మసూద్ అజార్ లాంటి వాళ్లకు ఆశ్రయం కల్పిస్తూ అపవాదు మూట్టకట్టుకుంటోంది పాకిస్థాన్. ఈ పరిస్థితుల్లో గ్రే లిస్టు నుంచి బయటపడడం ఆ దేశానికి అంత ఈజీ కాకపోవచ్చు.