NTV Telugu Site icon

Muhammad Yunus: ఆర్మీ పాలనకు నో.. యూనస్ నేతృత్వంలో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం..

Muhammad Yunus

Muhammad Yunus

Muhammad Yunus: నోబెల్ విజేత ముహ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నట్లు తెలుస్తోంది. తాను ప్రభుత్వానికి సారథ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా తర్వాత ఆర్మీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ దేశ ఆర్మీ చీఫ్ ప్రకటించారు. అయితే, ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులు మాత్రం ముహ్మద్ యూనస్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకే మొగ్గు చూపారు. ఈ విషయాన్ని విద్యార్థి నేత నహిద్ ఇస్లాం సోషల్ మీడియా పోస్ట్ ద్వారా చెప్పారు. డాక్టర్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని మేము అధ్యక్షుడిని కోరుతున్నామని అన్నారు.

Read Also: MP Fraud: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పీఏ నంటూ బురిడీ.. కేటుగాడు అరెస్ట్

ఇదిలా ఉంటే ఈ రోజు అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ పార్లమెంట్‌ని రద్దు చేశారు. దీంతో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సైన్యం నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటును తాము అంగీకరించబోమని విద్యార్థి నాయకులు చెప్పారు. ‘‘మేము మా రక్తాన్ని చిందించాము. కొత్త బంగ్లాదేశ్ నిర్మించాలనే మా ప్రతిజ్ఞను నెరవేర్చాలి’’ అని ఇస్లాం అన్నారు. విద్యార్థులు ప్రతిపాదించిన ప్రభుత్వం తప్పా తమకు ఏ ప్రభుత్వం ఆమోదం కాదని, ఏ సైనిక లేదా సైన్యం మద్దతు ఉన్న ప్రభుత్వం లేదా ఫాసిస్టు ప్రభుత్వాన్ని ఆమోదించబోమని చెప్పారు.

‘‘పేదల బ్యాంకర్’’గా పిలిచే నోబెల్ శాంతి బహుమతి విజేత ముహ్మద్ యూనస్ మాట్లాడుతూ..‘‘ బంగ్లాదేశ్‌లో నా దేశం కోసం నా ప్రజల ధైర్యం కోసం ఎలాంటి చర్య అవసరమైన నేను దానిని తీసుకుంటాను’’ అని అను చెప్పాడు. స్వేచ్ఛా ఎన్నికల కోసం పిలుపునిచ్చాడు. చిన్న రుణాలను అందించడం ద్వారా లక్షలాది మంది పేదరికం నుండి బయటపడటానికి సహాయం చేసిన ఘనత యూనస్ దే. బంగ్లాదేశ్‌లో అవినీతి ఆరోపణలను ఇతను, హసీనా పాలనలో విచారణకు గురయ్యాడు. కొత్తగా ఏర్పాటు కానున్న తాత్కాలిక ప్రభుత్వంలో మాజీ ప్రధాని ఖలిదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ), జమాతే ఇస్లామీ పార్టీతో పాటు విద్యార్థి నాయకులు ఉండబోతున్నారు.