Mossad: ఇజ్రాయిల్ ఒక కోటి మంది జనాభా ఉండే అతిచిన్న దేశం. కానీ టెక్నాలజీ, మిలిటరీ ,వ్యవసాయం పరంగా ప్రపంచానికే పాఠాలు నేర్పింది. చుట్టూ శత్రు దేశాలు ఉన్నా ఎలాంటి భయం లేకుండా బతుకుతోంది. దీనికి కారణం ఆ దేశ నిఘా వ్యవస్థ. ఇజ్రాయిల్ గూఢచార సంస్థ ‘‘మొసాద్’’ ఈ పేరు వింటే శత్రదేశాలకు హడలే. వీరు మనుషులు కాదు, యమకింకరులు అన్నా తక్కువే. వీరి ఆపరేషన్లు అలా ఉంటాయి. తమకు శత్రువులైన వారు ఎక్కడ ఉన్నా కూడా వదిలిపెట్టని నైజం మొసాద్ది. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా చస్తారో కూడా ఇజ్రాయిల్ శత్రువలకే తెలియదు.
మ్యూనిచ్ నరమేధానికి ప్రతీకారమే హైలెట్:
1972 జర్మనీ మ్యూనిచ్ సమ్మర్ ఒలింపిక్స్లో 11 మంది ఇజ్రాయిల్ క్రీడాకారుల్ని పాలస్తీనా ఉగ్రవాద సంస్థ బ్లాక్ సెప్టెంబర్ అత్యంత దారుణంగా ఊచకోత కోసింది. దీనికి ప్రతి స్పందనగా అప్పటి ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి గోల్డా మెయిర్, ఈ హత్యలకు కారణమైన ప్రతీ ఒక్కరిని చంపేయాలని తన గూఢచార సంస్థ ‘మొసాద్’ని ఆదేశించింది. మొస్సాద్ చీఫ్ జ్వీ జమీర్ , ఉగ్రవాద నిరోధక సలహాదారు అహరోన్ యారివ్లతో కలిసి బ్లాక్ సెప్టెంబర్ మరియు ఇతర సంబంధిత తీవ్రవాద గ్రూపుల నాయకత్వాన్ని నిర్మూలించడానికి ఒక ప్రణాళికను రూపొందించారు. ఇంకేముందు ఒక్కొక్కరుగా విదేశాల్లో ఉన్న ప్రతీ ఒక్క శత్రువుని మట్టుపెట్టింది. మ్యూనిచ్ ఘటన తర్వాత ఏడేళ్లలో ‘‘ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్’’ పేరుతో యూరప్, మిడిల్ ఈస్ట్లోని డజనుకు పైగా ఉగ్రవాదుల్ని హత్య చేసింది. ‘‘కిడాన్’’ అనే ప్రత్యేకంగా శిక్షణ పొందిన హిట్-టీమ్ ఈ రహస్య ఆపరేషన్లు నిర్వహించింది.
మ్యూనిచ్ ఊచకోత:
సెప్టెంబరు 5, 1972న, ఎనిమిది మంది బ్లాక్ సెప్టెంబర్ సభ్యులు మ్యూనిచ్లోని ఒలింపిక్ గ్రామంలోకి చొరబడ్డారు. వారు 11 మంది ఇజ్రాయిల్ అథ్లెట్లను, కోచ్ని బందీలుగా చేసుకున్నారు. దాడి ప్రారంభంలోనే ఇద్దర్ని చంపేశారు. ఇజ్రాయిల్ జైళ్లలో ఉన్న 234 మంది ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇలా ప్రతిష్టంభన గంటల పాటు సాగింది. జర్మన్ అధికారులు చర్చలకు ప్రయత్నించారు. రెండు మిలిటరీ హెలికాప్టర్లతో కైరోకి తరలిస్తామని ఉగ్రవాదులకు మాట ఇవ్వడంతో వారు ఎయిర్ ఫీల్డ్కి వెళ్లారు. ఇలా జర్మన్ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. అయితే ఈ ఆపరేషన్ ఫెయిల్ కావడంతో మిగిలిన ఇజ్రాయిల్ బందీలు, ఒక జర్మన్ అధికారి, ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు.
ఒక్కోక్క ఉగ్రవాది ఖతం:
1) వేల్ జ్వైటర్:
మొసాద్ మొదటి లక్ష్యం వేల్ జ్వైటర్. ఇతను రోమ్లో నివసిస్తున్న పాలస్తీనా, ఇటలీలోని బ్లాక్ సెప్టెంబర్ అధిపతి. మ్యూనిచ్ దాడిలో ఇతను పాల్గొన్నాడని మొసాద్ నమ్మింది. అక్టోబర్ 16, 1972లో ఇద్దరు మొసాద్ ఏజెంట్లు జ్వైటర్ని అతని అపార్ట్మెంట్ లాబీలో ‘11’ సార్లు కాల్చి చంపారు.
2) మహమూద్ హంసారీ:
ఇతను ఫ్రాన్స్లో ‘‘పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్(పీఎల్ఓ)’’ ప్రతినిధి. పారిస్ అపార్ట్మెంట్లో ఇతని ట్రాక్ చేసిన మొసాద్ ఏజెంట్లు, రిపోర్టర్లుగా నటిస్తూ అతని టెలిఫోన్లో బాంబు పెట్టారు. డిసెంబర్ 8, 1972లో దాన్ని పేల్చి హంషారీని హతం చేశారు.
3) బీరూల్ ఆపరేషన్:
మొసాద్ చేసిన అత్యంత సాహసోపేత ఆపరేషన్లలో ఒకటి. ఇజ్రాయిల్ కమాండోలతో పాటు ఎలైట్ సయరెట్ మత్కల్ యూనిట్కి చెందిన ఏజెంట్లు మహిళల వేషంలో లెబనాన్ రాజధాని బీరూట్లోకి వెళ్లారు. ఈ ఆపరేషన్ ముగ్గురు కీలక వ్యక్తుల్ని టార్గెట్ చేసింది. ఈ ఆపరేషన్లో మహ్మద్ యూసఫ్ అల్-నజ్జర్, కమల్ అద్వాన్, కమల్ నాసర్ని చంపేశారు. వీరిని హతం చేసిన ఇజ్రాయిల్ ఎజెంట్లలో ఎహుద్ బరాక్ ఉన్నారు. ఇతను ఆ తర్వాత ఇజ్రాయిల్ ప్రధాని అయ్యారు.
4) హుస్సేన్ అల్ బషీర్:
హుస్సేన్ అల్ బషీర్, సైప్రస్లో ఉన్న పీఎల్ఓ ఉగ్రవాదని తదుపరి లక్ష్యంగా చేసుకున్నారు. జనవరి 24, 1973న, మొస్సాద్ ఏజెంట్లు నికోసియా హోటల్లో అతని మంచం కింద బాంబును అమర్చారు. పేలుడు ధాటికి బషీర్ అక్కడికక్కడే మరణించాడు.
5) అలీ హసన్ సలామే:
‘‘రెడ్ ప్రిన్స్’’గాయ పిలిచే అలీ హసన్ సలామే బ్లాక్ సెప్టెంబర్ ఆపరేషన్ చీఫ్. పీఎల్ఓ చీఫ్ యాసర్ అరాఫత్కి సన్నిహితుడు. నార్వేలో అంతకుముందు ఇతడి అంతమొందించే ఆపరేషన్ విఫలమైంది. ఆ సమయంలో అమాయక మొరాకో వెయిటర్ చనిపోయాడు. 1979లో సలామే మరియు అతని భార్యతో స్నేహం చేసిన ఒక మొసాద్ సీక్రెట్ ఏజెంట్ సమాచారం అందించడంతో జనవరి 22, 1979లో బీరూట్లో కారుబాంబు దాడిలో హతమార్చింది.