Meta: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ప్రపంచవ్యాప్తంగా న్యాయపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. మెటా సోషల్ మీడియాలు వ్యవసానికి కారణమవుతున్నాయని, ఇదే కాకుండా దాని యాప్లు పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని అమెరికాలో మెటా అనేక పిటిషన్లను ఎదుర్కొంటోంది. మెటా 1.4 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 133.92 లక్షల కోట్లు) వరకు జరిమానాలను కూడా ఎదుర్కోవచ్చు. ఈ కొత్త కేసు విచారణ కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో ఉన్న ఫెడరల్ కోర్టులో మంగళవారం ప్రారంభం కానుంది. గత వారం, మెటా ఈ కేసును కొట్టివేయాలని కోరింది, కానీ ఆ కంపెనీ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
ఈ కేసులో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, ఇన్స్టాగ్రామ్ అధిపతి ఆడమ్ మొసేరీ సహా కంపెనీ సీనియర్ అధికారులు సాక్ష్యం చెప్పాల్సి వచ్చే అవకాశం ఉంది. ఈ కంపెనీ భారీ జరిమానా ఎదుర్కోవచ్చు. యూజర్లను తన ప్లాట్ఫామ్లకు బానిసలుగా చేసే ఫీచర్లను మెటా ఉద్దేశపూర్వకంగా అమలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. 2023లో అమెరికాలో పలు రాష్ట్రాలు మెటాపై ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి. కంపెనీ భద్రతా విధానాలపై పలు రాష్ట్రాలు దర్యాప్తు జరిపి, మెటా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ వల్ల పిల్లలు, కౌమార దశలో ఉన్నవారికి తీవ్రమైన హాని జరుగుతుందని వెల్లడి కావడంతో ఈ చర్య తీసుకున్నారు.
కాలిఫోర్నియా, కొలరాడో, కెంటకీ, న్యూజెర్సీ సహా మొత్తం 29 రాష్ట్రాలు మెటా పిల్లల ఆన్లైన్ గోప్యతా పరిరక్షణ చట్టం COPPAను ఉల్లంఘించిందని ఆరోపించాయి. 13 ఏళ్లలోపు పిల్లలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉపయోగిస్తున్నారని మెటాకు తెలిసినప్పటికీ, వారి తల్లిదండ్రుల సమ్మతి లేకుండా వారి డేటాను సేకరించిందనేది మరో ప్రధాన ఆరోపణ ఉంది. ఈ కేసులో రాష్ట్రాలు $1.4 ట్రిలియన్ వరకు జరిమానా కోరే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది.

