Indian Origin Family Murder : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో భారత సంతతికి చెందిన నలుగురు కుటుంబీకులు హత్యకు గురైన సంగతి తెలిసిందే. కుటుంబం మొత్తం హత్యకు గురి కావడానికి పాత కక్షలే కారణమని పోలీసులు తేల్చారు. హత్యకు గురైన కుటుంబానికి, హంతకుడికి మధ్య గతంలో వివాదాలు ఉన్నట్లు గుర్తించారు. గత సోమవారం కాలిఫోర్నియాలో ఎనిమిది నెలల చిన్నారి అరూహి ధేరి, ఆమె తండ్రి జస్దీప్ సింగ్, తల్లి జస్లీన్ కౌర్, పెదనాన్న అమన్దీప్సింగ్ కిడ్నాప్కు గురయ్యారు.
కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టిన మూడు రోజులకు ఎనిమిది నెలల పాపతో పాటు మరో ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు స్థానికంగా ఉన్న వ్యవసాయ భూమిలో లభ్యమయ్యాయి. ఈ ఘటన స్థానిక భారత సంతతిలో తీవ్ర విషాదాన్ని నింపింది. కిడ్నాప్ జరిగిన ప్రదేశంలోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా జీసస్ మాన్యుయేల్ సల్గాడో అనే 48ఏళ్ల వ్యక్తిని నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గతంలో జస్దీప్ సింగ్ కు చెందిన ట్రక్ ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో ఉద్యోగం చేసినట్లు దర్యాప్తులో తేలినట్టు పోలీసులు తెలిపారు.
Read Also: Imran Khan Arrest: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ అరెస్టుకు రంగం సిద్ధం
పోలీసుల కథనం ప్రకారం.. జస్దీప్ సింగ్ కంపెనీలో నిందితుడు సల్గాడో డ్రైవర్గా పనిచేశాడు. ఆ సందర్భంగా వారి మధ్య గొడవలు జరిగడంతో ఉద్యోగం నుంచి తీసేశారు. ఇది మనసులో పెట్టుకున్న సల్గాడో అప్పట్లో సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇప్పుడు కుటుంబం అంతటిని కిడ్నాప్ చేసి హతమార్చాడు. పలు కేసుల్లో అతడు 10 ఏండ్లు జైల్లో ఉండి వచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ మరణాలపై మెర్సిడ్ కౌంటి పోలీసు అధికారి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తనకు వచ్చే కోపాన్ని పదాల్లో వర్ణించలేనని.. నేరానికి పాల్పడిన వ్యక్తికి నరకంలో ప్రత్యేక స్థానం ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.