Ind vs Pak Water Emergency: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పేందుకు సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడంతో దాయాది దేశానికి నీటి కష్టాలు మొదలయ్యాయి. జలాశయాల్లో నీటిమట్టం పడిపోవడంతో.. సింధు బేసిన్లో నీటి ప్రవాహం 15 శాతం మేర తగ్గిపోయింది. వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన రైతులకు ఖరీఫ్లో మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. పంజాబ్ ప్రావిన్సులో ప్రస్తుతం నీటి విడుదల 1.24 లక్షల క్యూసెక్కులకు తగ్గిపోగా.. తాజా గణాంకాల ప్రకారం పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని టార్బెలా ఆనకట్ట దగ్గర సింధూ నది నీటి మట్టం 1,465 మీటర్లకు పడిపోయింది.. కనిష్ఠ స్థాయి నీటిమట్టం 1,402 మీటర్లు ఉంది.
Read Also: Israel: హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ మృతదేహం స్వాధీనం చేసుకున్న ఐడీఎఫ్
అయితే, పంజాబ్లోని చస్మా ఆనకట్ట వద్ద ప్రస్తుత నీటిమట్టం 644 మీటర్లుగా ఉందని పాక్ అధకారులు తెలిపారు. ఇక్కడ డెడ్ స్టోరేజీ స్థాయి 638 మీటర్లకు చేరినట్లు తెలుస్తుంది. ఇక, సియాల్కోట్లో మరాలా దగ్గర పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది.. చీనాబ్పై సగటు నీటి విడుదల మే 28వ తేదీ నాటికి 26,645 వేల క్యూసెక్కులు ఉంటే జూన్ 5వ తేదీ నాటికి 3,064 క్యూసెక్కులకు పడిపోయింది. ఈ నీటి ఎద్దడితో పాక్లోని పంజాబ్లో ఖరీఫ్ పంటలు ఇప్పుడు కష్టాల్లో పడ్డాయి. భారత్ నిర్ణయంతో 21 శాతం నీటి కొరత ఏర్పడుతుందని ఇప్పటికే పాక్ అంచనా వేసింది. టెర్రరిజంపై పాక్ తీరు మారే వరకూ ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.