అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం జరిగింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గాయి. అలాగే హార్ముజ్ నుంచి నౌకలు సాఫీగా సాగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇజ్రాయెల్ సంచలన ప్రకటన చేసింది. దక్షిణ లెబనాన్లో సైనిక చర్యలు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ వెల్లడించింది. తమ భద్రతకు ముప్పుగా భావిస్తున్న అంశాలను పూర్తిగా తొలగించే వరకు ఆపరేషన్లు కొనసాగుతాయని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
ఈ మేరకు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) దక్షిణ లెబనాన్లో ప్రకటించిన “సెక్యూరిటీ జోన్” మ్యాప్ను విడుదల చేశాయి. ఈ భద్రతా ప్రాంతం లెబనాన్ భూభాగంలో సుమారు 10 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని తెలిపాయి. ఉత్తర ఇజ్రాయెల్ ప్రజల భద్రతను బలోపేతం చేయడం, ముప్పులను తొలగించడం కోసం తమ సైన్యం అక్కడే కొనసాగుతుందని పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన ఒక అధికారి మాట్లాడుతూ.. “భద్రతా మండలానికి వెలుపల కూడా మా సైనికులకు, ఇజ్రాయెల్ పౌరులకు ముప్పుగా గుర్తించిన లక్ష్యాలపై చర్యలు కొనసాగిస్తాం” అని తెలిపారు.
బుధవారం అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో లెబనాన్ సహా అన్ని రంగాల్లో యుద్ధ విరమణకు పిలుపునిచ్చారు. అయితే ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో ఒక వ్యక్తి మరణించినట్లు లెబనాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. మరోవైపు దక్షిణ లెబనాన్లో జరిగిన ఘటనలో తమ సైనికుల్లో ఒకరు మరణించగా.. మరో ఏడుగురు గాయపడినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. లెబనాన్ సైన్యం ఇజ్రాయెల్ దళాలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని.. సాధారణ ప్రజలు భద్రతా మండలంలోకి ప్రవేశించవద్దని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
ఇరాన్కు మద్దతుగా ఉన్న హిజ్బుల్లా సంస్థ మార్చిలో ఇజ్రాయెల్పై దాడులు ప్రారంభించడంతో లెబనాన్ కూడా మధ్యప్రాచ్య యుద్ధంలో భాగమైంది. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ లెబనాన్పై వైమానిక దాడులు జరిపి దక్షిణ ప్రాంతంలో భూసైన్యాన్ని మోహరించింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఏప్రిల్ నుంచి వాషింగ్టన్ వేదికగా ప్రత్యక్ష చర్చలు కొనసాగుతున్నాయి. హిజ్బుల్లాతో ఉన్న ఘర్షణలను ముగించడం, లెబనాన్ సమస్యను ప్రాంతీయ యుద్ధం నుంచి వేరుచేయడం లక్ష్యంగా ఈ చర్చలు జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్ సైనిక అధికారి ప్రకారం.. “ఇరుదేశాల మధ్య ప్రత్యక్ష చర్చల పరిధిలో మరిన్ని చర్యలపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ప్రతినిధులు వచ్చే వారం మళ్లీ సమావేశం కానున్నారు” అని వెల్లడించారు. అమెరికా-ఇరాన్ ఒప్పందం తర్వాత లెబనాన్లో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఇజ్రాయెల్ తాజా ప్రకటనతో ప్రాంతంలో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గలేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

