Israel-Iran War: ఇజ్రాయిల్- ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రంగా మారింది. అమెరికా కూడా ఇజ్రాయిల్కు మద్దతుగా రంగంలోకి దిగింది. ఈ రోజు(శనివారం) ఉదయం ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఎటాక్స్ జరిగాయి. ఇదిలా ఉంటే, ఇరాన్ ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. ఇజ్రాయిల్తో పాటు అమెరికా మిత్రదేశాలపై దాడులకు తెగబడింది. మధ్యప్రాచ్యంలోని అమెరికా మిత్రదేశాలు, ఆ దేశాల్లో ఉన్న యూఎస్ స్థావరాలు దాడికి గురవుతున్నాయి.
ప్రస్తుతం వస్తున్న నివేదికల ప్రకారం, ఇరాన్ బహ్రెయిన్లోని అమెరికన్ నేవల్ బేస్పై అటాక్ చేసింది. ఇదే కాకుండా యూఏఈలోని అల్ -డఫ్రా సైనిక స్థావరం, కువైట్ అలీ అల్ సలేమ్ బేస్పై, ఖతార్, జోర్డాన్ లోని అమెరికన్ స్థావరాలపై దాడులు చేసింది. మిడిల్ ఈస్ట్లోని అమెరికా సైనిక స్థావరాలపై మిస్సైల్స్తో ఇరాన్ విరుచుకుపడుతోంది. అబుదాబి సమీపంలోని అల్-ధఫ్రా (Al-Dhafra) అమెరికా వైమానిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. అబుదాబిలో భారీ శబ్దాలు వినిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
మొత్తం 7 దేశాల్లోని స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. బహ్రైయిన్, కువైట్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్లోని అమెరికా స్థావరాలపై ఏకకాలంలో దాడులు చేసింది. బహ్రైయిన్లోని అమెరికా నౌకదళానికి చెందిన 5వ ఫ్లీట్ హెడ్క్వార్టర్స్ను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేసినట్లు ఆ దేశ ప్రభుత్వం ధ్రువీకరించింది. సౌదీ అరేబియాలోని అమెరికా స్థావరంపై కూడా ఇరాన్ క్షిపణి దాడి చేసింది.