US-Iran Tension: ఇరాన్, అమెరికా మధ్య ఓ వైపు అణు చర్చలు జరుగుతున్నప్పటికీ, మరోవైపు ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ అధికారులు రెండు వారాల్లో కొత్త ప్రతిపాదనతో చర్చలు జరపడానికి అంగీకరించినప్పటికీ, అమెరికా మాత్రం ఇరాన్ సమీపంలో సైన్యాన్ని మోహరిస్తూనే ఉంది. F-35లు, F-22లు, F-16లు సహా 50కి పైగా US ఫైటర్ జెట్లు గత 24 గంటల్లో పశ్చిమాసియాకు తరలించారు. మంగళవారం జెనీవాలో ఇరాన్, యూఎస్ అణుచర్చల్లో పురోగతి ఉందని యూఎస్ అధికారులు చెప్పారు. అయినప్పటికీ, ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు ఇలా సైనిక మోహరింపులు చేపట్టినట్లు భావిస్తున్నారు.
Read Also: Kiren Rijiju: రాహుల్ గాంధీ దేశ భద్రతకు అత్యంత ప్రమాదకరం..
జనవరిలో ఇరాన్ వ్యాప్తంగా సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. వీటిని ఇరాన్ క్రూరంగా అణిచివేసింది. అప్పటి నుంచి ఇరాన్పై అమెరికా ఒత్తిడి తీసుకువస్తోంది. పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో జనవరి చివర్లో ట్రంప్ విమాన వాహక నౌక్ USS అబ్రహం లింకన్ను అరేబియా సముద్రంలోకి పంపాడు. తరువాత, ఫిబ్రవరి మొదటి వారంలో, ఒక డజను F-15 ఫైటర్ జెట్లు, ఒక MQ-9 రీపర్ కంబాట్ డ్రోన్ మరియు అనేక A-10C థండర్బోల్ట్ II గ్రౌండ్ అటాక్ ఎయిర్క్రాఫ్ట్లు కూడా జోర్డాన్లోని మువాఫ్ఫాక్ సాల్టి ఎయిర్ బేస్కు చేరుకున్నాయని పలు మీడియా సంస్థలు నివేదించాయి.
ఇదే కాకుండా గైడెడ్ మిస్సైల్ విధ్వంసక నౌక USS డెల్బర్ట్ D బ్లాక్ సూయజ్ కెనాల్ ద్వారా ఎర్ర సముద్రంలోకి వెళ్లింది. యూఎస్ నేవీ MQ-4C ట్రైటాన్ నిఘా డ్రోన్ గల్ఫ్ మీదుగా ప్రయాణించాయి. E-11A కమ్యూనికేషన్ విమానం, P-8 పోసిడాన్, E-3G సెంట్రీ నిఘా విమానాలు కూడా మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి చేరాయి. ఇదిలా ఉంటే, యూఎస్కు కౌంటర్ ఇవ్వడానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో ఇరాన్ మిస్సైల్ టెస్ట్ నిర్వహించింది.