Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్! హోర్ముజ్ జలసంధిపై బిగ్ అనౌన్స్‌మెంట్..

  • 30 రోజుల్లో ‘హోర్ముజ్ జలసంధి’ పునరుద్ధరణ..
  • కీలక ప్రకటన చేసిన ఇరాన్
Strait Of Hormuz

Strait Of Hormuz

Iran’s Big Announcement: గత కొన్ని నెలలుగా మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా అట్టుడుకుతున్న అంతర్జాతీయ చమురు మార్కెట్‌కు ఊపిరిని ఇచ్చే వార్త ఒకటి ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రపంచానికి ఇంధన జీవనాధారమైన ‘హోర్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) గుండా నౌకల రాకపోకలు రాబోయే 30 రోజుల్లోగా సాధారణ స్థితికి చేరుకుంటాయని ఇరాన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. యుద్ధానికి ముందు ఈ మార్గంలో ఏ స్థాయిలో అంతర్జాతీయ రవాణా సాగిందో.. నెల రోజుల్లో మళ్లీ అదే స్థాయికి తీసుకురావడానికి చర్చలు జరుగుతున్నట్లు ఇరాన్ వెల్లడించింది.

అమెరికా – ఇరాన్ ఒప్పందం క్లోజ్.. హింట్ ఇచ్చిన ట్రంప్
మరోవైపు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేలా అమెరికా – ఇరాన్ సహా పలు దేశాల మధ్య ఒక కీలక ఒప్పందం దాదాపు ఖరారైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగానే హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు ఇరాన్ అంగీకరించిందని, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ శాంతి చర్చల పురోగతిపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తాము ఇరాన్ లీడర్లతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, అమెరికా – ఇరాన్ మధ్య తదుపరి చర్చలు త్వరలోనే జరగబోతున్నాయని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ వెల్లడించారు. అమెరికా – ఇరాన్‌ల మధ్య ఈ పురోగతిని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్వాగతించారు. యుద్ధానికి ముగింపు పలికి, హోర్ముజ్ మార్గాన్ని సురక్షితం చేసే ఈ శాశ్వత ఒప్పందం ప్రపంచానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.

భారత్‌కు భారీ ఊరట
హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ నిర్ణయం భారతదేశానికి అతిపెద్ద సానుకూల అంశంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ తన ముడి చమురు అవసరాలలో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో సింహభాగం ఈ హోర్ముజ్ మార్గం గుండానే వస్తుంది. యుద్ధ భయంతో ఇప్పటి వరకు నౌకలు సుదీర్ఘ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం వల్ల రవాణా, ఇన్సూరెన్స్ ఖర్చులు భారీగా పెరిగాయి. ఈ మార్గం మళ్లీ సురక్షితంగా మారితే రవాణా భారంతో పాటు భారతదేశ దిగుమతుల ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని చెబుతున్నారు. ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరా వ్యవస్థ మళ్లీ గాడిన పడుతుంది. ఇంధన ధరలు స్థిరపడటంతో పాటు, గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పలు దేశాల ఆర్థిక వ్యవస్థలకు భారీ ఊపు లభిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.