మధ్యప్రాచ్యంలో తీవ్రమైన ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఇంధన మార్కెట్లను అస్థిరపరుస్తున్నాయి. అనేక దేశాలు ఇంధన సంక్షోభం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంతో అతలాకుతలం అవుతున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న సమయంలో, పొరుగు దేశం పాకిస్తాన్ కూడా తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ ఫెడరల్ పెట్రోలియం మంత్రి అలీ పర్వైజ్ మాలిక్ తమ దేశం బలహీనమైన ఇంధన భద్రతను స్వయంగా బహిర్గతం చేశారు.
ఇటీవల ఒక పాకిస్తానీ టీవీ ఇంటర్వ్యూలో మంత్రి మాట్లాడుతూ.. “మన దగ్గర వ్యూహాత్మక చమురు నిల్వలు ఏమీ లేవు. మనం కేవలం వాణిజ్య నిల్వలు మీదే ఆధారపడి ఉన్నాం. ప్రస్తుతం మన వద్ద 5 నుంచి 7 రోజులకు సరిపడా ముడి చమురు (Crude Oil) మాత్రమే ఉంది. చమురు మార్కెటింగ్ కంపెనీల వద్ద ఉన్న శుద్ధి చేసిన ఉత్పత్తులు కూడా 20-21 రోజులు మాత్రమే సరిపోతాయి. భారతదేశంలా 60-70 రోజుల నిల్వలు ఉంచుకుని, ఒక్క సిగ్నల్ తో ఎక్కడి నుంచైనా చమురు తీసుకోగల సామర్థ్యం మనకు లేదని కుండబద్దలుకొట్టారు. మంత్రి మాట్లాడుతూ, పాకిస్తాన్లో వ్యూహాత్మక నిల్వలు లేవని స్పష్టంగా ధృవీకరించారు. దేశం ప్రస్తుతం “Just-in-Time” వ్యవస్థపై ఆధారపడి ఉందని తెలిపారు.
