గాజా సరిహద్దు సమీపంలోని ఇజ్రాయెల్ ప్రజలు నివాసం ఉండే ప్రాంతంలో ఐడీఎఫ్ ఫైటర్ జెట్ బాంబు దాడి జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో ఐడీఎఫ్ దళాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే ఈ దాడి కేవలం సాంకేతిక లోపంతో జరిగినట్లుగా ఇజ్రాయెల్ తెలిపింది.
గాజాపై దాడికి ఐడీఎఫ్ ఫైటర్ జెట్ మందుగుండు సామగ్రితో వెళ్తోంది. అయితే ఉన్నట్టుండి ఇజ్రాయెల్ ప్రజలు నివాసం ఉండే నిర్ యిట్జాక్ సమీపంలోని బహిరంగ ప్రదేశంలో బాంబు పడిపోయింది. దీంతో పెద్ద విస్ఫోటనం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. కేవలం ఇది సాంకేతిక లోపంతో జరిగిందని క్లారిటీ ఇచ్చింది. నిర్ యిట్జాక్ ప్రాంతంలో దాదాపు 550 మంది నివాసం ఉంటారు.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజాకు వెళ్తు్న్న రోజే ఈ ఘటన చోటుచేసుకుంది. బందీలను తిరిగి ఇచ్చేంత వరకు హమాస్పై దాడులు జరుగుతూనే ఉంటాయని నెతన్యాహు తెలిపారు.
పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక, భూ దాడులను కొనసాగిస్తూనే ఉంది. హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం ముగియడంతో గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇటీవల చోటుచేసుకున్న బాంబు దాడుల్లో వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.