Elon Musk: టెస్లా అధినేత, ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్కి అరుదైన ఆహ్వానం అందింది. హమాస్ ఉగ్రసంస్థ మస్క్ని గాజా సందర్శించాల్సిందిగా ఆహ్వానించింది. ఇజ్రాయిల్ పర్యటనలో ఉన్న ఎలాన్ మస్క్, ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఇజ్రాయిల్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. ఈ పర్యటన తర్వాత గాజాను సందర్శించాలని హమాస్ సీనియర్ అధికారి మంగళవారం మస్క్కి ఆహ్వానం పలికారు.
ఇజ్రాయిల్, గాజాపై జరిగిప విధ్వంసాన్ని చూడాలని, అందుకోసం గాజా స్ట్రిప్లో పర్యటించాలని హమాస్ కోరింది. గాజాలో మారణకాండ, విధ్వంసాన్ని చూడాలని మస్క్ని ఆహ్వానించినట్లు హమాస్ సీనియర్ అధికార ఒసామా హమ్దాన్, లెబనాన్ బీరూట్లో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. సోమవారం మస్క్ ఇజ్రాయిల్లో పర్యటించి, హమాస్ దాడి చేసిన ప్రాంతాలను సందర్శించారు. హమాస్ని హతమార్చడం తప్పితే వేరే మార్గం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్కి మద్దతు ప్రకటించారు.
అక్టోబర్ 7 నాటి హమాస్ దాడుల ఫలితంగా ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం జరిగుతోంది. ప్రస్తుతం ఇరు పక్షాలు కూడా కాల్పుల విరమణ, సంధి ఒప్పందాన్ని అంగీకరించాయి. హమాస్ ఉగ్రవాదులు బంధించిన ఇజ్రాయిలీలను, ఇతర దేశాల వారిని వదిలిపెడుతున్నారు, దీనికి ప్రతిగా ఇజ్రాయిల్ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్లును వదిలేస్తున్నారు. నాలుగు రోజుల సంధిని మరో రెండు రోజులకు పొడగించారు.
హమాస్ లీడర్ హమ్దాన్ మాట్లాడుతూ.. 50 రోజుల్లో ఇజ్రాయిల్ 40,000 టన్నులకు పైగా పేలుడు పదార్థాలను పడేసిందని ఆరోపించారు. ఇజ్రాయిల్లో అమెరికా తన సంబంధాలను సమీక్షించాలని, వారికి ఆయుధాలు సరఫరా చేయవద్దని, అమెరికా ప్రెసిడెంట్ని కోరారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో ఇజ్రాయిల్లో 1200 మంది మరణించాగా.. హమాస్ 240 మందిని బందీలుగా పట్టుకుంది. ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 16000 మంది పాలస్తీనియన్లు మరణించారు.