NTV Telugu Site icon

Sri Lanka Crisis: శ్రీలంక సర్కార్‌ కీలక నిర్ణయం..

Sri Lanka

Sri Lanka

శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో రెండు నెల క్రితం రోడ్లెక్కిన జనం.. ఆందోళనలు ఉధృతం చేశారు. నిరసనలు కాస్త హింసాత్మకంగా మారాయి. దీంతో ఎమర్జెన్సీ విధించిన శ్రీలంక ప్రభుత్వం.. తరువాత సడలించింది. మళ్లీ మే 6 నుంచి చేపట్టిన నిరనసలు విధ్వంసానికి దారి తీయడంతో.. రెండోసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆ తరువాత మహింద రాజపక్స రాజీనామా చేయడం, కొత్త ప్రధానిగా రణిల్‌ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. ఇదే సమయంలో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టడంతో… తాజాగా ఎమర్జెన్సీని ఎత్తివేసింది లంక ప్రభుత్వం. దీంతో అక్కడి ప్రజలకు ఇబ్బందులు తప్పనున్నాయి.

Read Also: Nara Lokesh: కోర్టుకు హాజరైన నారా లోకేష్.. ఉద్రిక్తత..!

మరోవైపు లంకలో ఆర్థిక సంక్షోభం, ఆహార కొరతతో జనం ఇబ్బందులు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆహారం దొరక్క ఆకలి చావులు చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో దేశంలో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. అటు ఆందోళనలు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో ఆర్థిక సంక్షోభానికి రాజపక్స కుటుంబమే కారణమని.. అధ్యక్షుడు గొటబయ రాజపక్స రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఇక, శ్రీలంకకు ఎన్నో విధాలుగా సాయం అందిస్తున్న భారత్‌ మరో.. 40 వేల టన్నుల డీజిల్‌ సరఫరా చేసింది. అలాగే బియ్యం, ఔషధాలు, పాలపొడి ఉత్పత్తులతో బయలుదేరిన నౌక.. శ్రీలంకకు చేరింది. భారత్‌తో పాటు జపాన్‌ కూడా 1.5 మిలియన్‌ డాలర్ల విలువైన అత్యవసర సాయాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఫోర్టిఫైడ్‌ బియ్యం, పప్పులు, నూనె వంటివాటిని లంకకు పంపించనున్నట్లు తెలిపింది జపాన్‌.