భారత్లో ఎండలు దంచికొడుతుంటే.. చైనాలో మాత్రం భారీ వర్షాలు హడలెత్తిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. వర్షాలు కారణంగా 22 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. 20 మంది గల్లంతయ్యారు. ఇక రంగంలోకి దిగిన అత్యవసర బృందాలు సహాయ చర్యలు చేపట్టారు.
ఈ వారం ప్రారంభం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా చైనాలోని పలు ప్రావిన్సులలో 22 మంది మరణించగా, 20 మందికి పైగా ఇప్పటికీ గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. అత్యంత ఘోరమైన ప్రమాదం గ్వాంగ్జీ ప్రావిన్సులో జరిగింది. వ్యవసాయ కార్మికులను తీసుకువెళ్తున్న ఒక పికప్ ట్రక్కు ఉప్పొంగిన నదిలో కొట్టుకుపోవడంతో 10 మంది మరణించారు. సైన్యం, అత్యవసర బృందాల సహాయంతో ప్రభావిత ప్రావిన్సుల నుంచి 24,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మే 19న గ్వీజౌ ప్రావిన్స్లోని డుయున్ నగరంలో కేవలం 24 గంటల్లోనే 310 మిల్లీమీటర్లకు పైగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. దీనివల్ల జియాన్జియాంగ్ నది తన గట్లను తెంచుకుని, పొంగిపొర్లుతున్న నదీ జలాలు డుయున్ వీధులను ముంచెత్తాయి. నగరంలోని ప్రధాన రహదారులపై వాహనాలు బొమ్మల్లా తేలియాడుతుండగా.. చాలా వాహనాలు పూర్తిగా నీట మునిగిపోయాయి.
