బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) భారీ విజయం సాధించింది. 299 స్థానాలకు గాను 209 స్థానాలు గెలుచుకుంది. ఇక బీఎన్పీ అధినేత తారిక్ రెహమాన్ పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఘన విజయం సాధించారు. బంగ్లాదేశ్ తదుపరి ప్రధానిగా తారిక్ రెహమాన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
గురువారం బంగ్లాదేశ్ ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసన తర్వాత సాయంత్రం 4:30 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటి నుంచి తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్పీనే ఆధిక్యం దిశగా దూసుకుపోయింది. జమాత్-ఏ-ఇస్లామీ పార్టీ అంత ప్రభావం చూపించలేదు. బంగ్లాదేశ్లో మొత్తం 300 పార్లమెంట్ స్థానాలు ఉండగా ఒక అభ్యర్థి మరణంతో అక్కడ పోలింగ్ ఆగిపోవడంతో 299 స్థానాలకు ఓటింగ్ జరిగింది. తాజా ఫలితాల్లో 208 స్థానాలను బీఎన్పీ గెలుచుకుంది.
తారిక్ రెహమాన్..
తారిక్ రెహమాన్.. బీఎన్పీ ఛైర్పర్సన్ ఖలీదా జియా కుమారుడు. ఇటీవలే ఆమె కన్నుమూసింది. ఇక 17 ఏళ్ల తర్వాత తారిక్ రెహమాన్ లండన్ నుంచి బంగ్లాదేశ్కు వచ్చారు. సమయం తక్కువగా ఉన్న ప్రచారంలో దూసుకుపోయారు. ప్రజలు సుస్థిరమైన పాలనకు ఓటేశారు.
ఆగస్టు, 2024లో విద్యార్థుల నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం స్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. అధికారంలోకి వస్తే ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడమే లక్ష్యమని తారిక్ రెహమాన్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు.
ఇది కూడా చదవండి: Ind vs Nam : నమీబియాపై భారత్ ఘనవిజయం.. ఇషాన్, హార్దిక్ మెరుపులు.!