Pakistan: టెంపోలో శవపేటికలు.. పాకిస్తాన్ పోలీసుల దుస్థితిపై తీవ్ర విమర్శలు

  • బీఎల్ఏ దాడుల్లో హతమవుతున్న పాక్ భద్రతా సిబ్బంది.
  • పోలీసులకు కనీస గౌరవం కూడా ఇవ్వని దాయాది దేశం..
  • టెంపోలో పోలీసులు శవపేటికల తరలింపు వైరల్..
Pakistan (1)

Pakistan (1)

Pakistan:  పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌లో తిరుగుబాటుదారుల దాడిలో మరణించిన పోలీసుల సంఖ్య 42కు పెరిగింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) పాక్ సైనికులు, పోలీసుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద దాడి ఇవే. ఈ దాడిలో ముందు 9 మంది పోలీసులు మరణించినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. అయితే, బీఎల్ఏ తిరుగుబాటుదారులు వీరిలో చాలా మందిని కిడ్నాప్ చేశారు. ఇప్పుడు మరణించిన వారి సంఖ్య నెమ్మదిగా బయటకు వస్తోంది. మరోవైపు, ఈ దాడిలో 54 మంది తిరుగుబాటుదారుల్ని చంపేశామని పాకిస్తాన్ చెబుతోంది.

ఇదిలా ఉంటే, చనిపోయిన సైనికులకు, పోలీసులకు పాకిస్తాన్ కనీస గౌరవాలు ఇవ్వడం లేదని మరోసారి నిరూపితమైంది. ఈ దాడిలో చనిపోయిన భద్రతా బలగాల పట్ల పాకిస్తాన్, బలూచిస్తాన్ ప్రభుత్వాలు దారుణంగా వ్యవహరిస్తున్నాయి దాడిలో మరణించి పోలీసుల శవపేటికల్ని ఓ టెంపో వాహనంలో తరలిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో 10 మంది పోలీసుల మృతదేహాలను శవపేటికలో ఉంచి ఒక టెంపోలో ఎక్కిస్తున్నారు. దీనిని చూసిన ఒక పాకిస్తానీ పౌరుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

‘‘ఒకప్పుడు పైన్ చెట్లకు ప్రసిద్ధి చెందిన జియారత్ ఇప్పుడు శవపేటికల ఉరేగింపుకు సాక్ష్యంగా ఉంది. ఈ పురాతన పైన్ చెట్లు శతాబ్ధాల చరిత్రను నిశ్శబ్దంగా చూస్తున్నాయి. పాక్ సైన్యం, ఐఎస్ఐ విధ్వంసక విధానాలు ఈ నగరాన్ని శవపేటికల నగరంగా మార్చాయి. ఈ విధానాలు బలూచిస్తాన్‌కు రక్తపాతం, బాధను మాత్రమే తీసుకువచ్చాయి. ప్రతీ శవపేటిక ఒక కుటుంబాన్ని, ఒక తల్లి కన్నీరును, వితంతువు దు:ఖాన్ని మోసుకెళ్తోంది’’ అని నెటిజన్ చేసిన భావోద్వేగ పోస్ట్ పాక్ వ్యాప్తంగా వైరల్‌గా మారింది.

ఎప్పటిలాగే ఈ దాడులకు సరిహద్దుకు బయట ఉన్న శక్తులే కారణమని నిందించాయి. చాలా మంది పోలీసుల్ని బీఎల్ఏ అపహరించింది. పాక్ ప్రభుత్వం వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో 54 మంది తిరుగుబాటుదారులు హతమైనట్లు పాక్ చెబుతోంది. గాలింపు చర్యల్లో కిడ్నాప్‌కు గురైన పలువురు పోలీసుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పాక్ సైన్యం చెబుతోంది.