Bangladesh: గతేడాది డిసెంబర్లో బంగ్లాదేశ్లోని మైమన్సింగ్ జిల్లాలో హిందూ వ్యక్తి దీపుచంద్ర దాస్ హత్య ఆ దేశంతో పాటు భారత్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అక్రమ దైవదూషణ ఆరోపణలతో మతోన్మాద గుంపు అతడిని దారుణంగా హత్య చేసింది. హత్య చేయడమే కాకుండా నడిరోడ్డుపై చెట్టుకు వేలాడదీసి దహనం చేశారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
Read Also: BJP: కాంగ్రెస్లో అత్యంత తెలివైన మూర్ఖుడు రాహుల్ గాంధీ..
అయితే, ఈ ఘటనపై బంగ్లా ప్రభుత్వం స్పందించింది. ఈ కేసులో నిందితుల్ని అరెస్ట్ చేసింది. దీపు చంద్ర దాస్ ఎలాంటి దైవ దూషణ వ్యాఖ్యలు చేయలేదని ప్రాథమిక విచారణలో తేలింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం దీపు దాస్ కుటుంబానికి బంగ్లా ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. వారి కుటుంబానికి శాశ్వత ఇల్లు నిర్మించడంతో పాటు ఆర్థికంగా సహాయం, మద్దతు ప్రకటించింది. గత నెలలో బంగ్లా విద్యా సలహాదారు సి ఆర్ అబ్రార్ దీపు గ్రామంలోని అతడి ఇంటిని సందర్శించారు. దాస్ కుటుంబానికి ప్రభుత్వం సంతాపాన్ని తెలియజేశారు. దీపు దాస్ హత్య మొత్తం దేశానికి సిగ్గుచేటని అబ్రార్ అన్నారు.
దీపు కుటుంబ ఇంటి నిర్మాణం కోసం 2.5 మిలియన్ టాకాలు, దీపు తండ్రి, భార్య ఒక్కొక్కరికి 1 మిలియన్ టాకాలు, అతడి బిడ్డ భవిష్యత్తు కోసం 5 లక్షల టాకాలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపారు. భారత కరెన్సీలో ఈ మొత్తం పరిహారం రూ. 37 లక్షలు.
