Bangladesh: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నిరసనలతో అట్టుడుకుతోంది. శుక్రవారం ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశ తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ అధికారిక నివాసం జమునా బయట ప్రభుత్వం ఉద్యోగులు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. ఉద్యోగులకు, పోలీసులకు మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు 9వ జాతీయ వేతన సంఘం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. తినడానికి తిండి లేదు, నోటితో అభివృద్ధి మాటలు ఎందుకు..? అని ఉద్యోగులు యూనస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఈ నిరసనలు చోటు చేసుకున్నాయి. 2024 ఆగస్టులో హింసాత్మక ఘటనల తర్వాత, షేక్ హసీనా పదవి నుంచి తప్పుకుని, భారత్ పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా ఎన్నికలు జరుగనున్నాయి. ఉద్యోగులు వేతన సంఘం నివేదిక ఆధారంగా గెజిట్ విడుదల చేసి, వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తు్న్నారు. అయితే, ఈ నిరసనల్ని అణిచివేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు, లాఠీచార్జ్ వాడారు.