Bangladesh: బంగ్లాదేశ్లో హిందూ కుటుంబంలోని నలుగురు దారుణహత్యకు గురయ్యారు. రంగ్పూర్లోని వారి ఇంట్లో శవాలుగా కనిపించారు. ఈ కేసులో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటి పైకప్పుపై ఇద్దరు వ్యక్తులు యాబా అనే మెథాంఫెటమైన్ డ్రగ్ను తీసుకుంటుండగా కుటుంబంలోని ఒక వ్యక్తి చూడటంతో, ఈ గుట్టు ఎక్కడ బయటపడుతుందనే భయంతో కుటుంబం మొత్తాన్ని చంపేసినట్లు తేలింది. బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం.. హత్యల తర్వాత నిందితులు వెంటనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా దాదాపు 6-7 గంటల పాటు ఇంట్లోనే ఖర్జూరా, దోసకాయలు తిని, స్నానం చేసి వెళ్లినట్లు తెలిసింది.
ఈ కేసులో మగ్ధో, సిద్ధార్థ అనే ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు రిటైర్డ్ రంగ్పూర్ జిల్లా స్కూల్ ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతిలత చక్రవర్తి (50), కుమార్తె ఆగామి చక్రవర్తి ప్రార్థి (23), 12 ఏళ్ల కుమారుడు ప్రియమ్ చక్రవర్తిలను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కుటుంబానికి ఎవరితో గొడవలు, శత్రుత్వం లేదని తేలింది. రంగ్పూర్ మెట్రోపాలిటన్ పోలీసులు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, డిటెక్టివ్ బ్రాంచ్ కలిసి దర్యాప్తు చేసి అనుమానితులను పట్టుకున్నారు.
రంగ్పూర్ పోలీస్ కమిషనర్ మహమ్మద్ అబ్దుల్ మాబుద్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి ఇద్దరు అనుమానితులు పక్కింటి భవనం పై నుంచి గణపతి ఇంటి పైకప్పు పైకి వచ్చారు. శబ్ధం వస్తుందని పైకి వెళ్లిన గణపతి, ఇద్దరు నిందితుల్ని ప్రశ్నించాడు. దీంతో తాము డ్రగ్స్ తీసుకున్న విషయం బయటకు వస్తుందని గొంతు నులిమి హత్య చేశారు. గొడవ శబ్ధాలు విన్న గణపతి భార్య ప్రీతిలత కూడా ఇలాగే చంపేశారు. దీని తర్వాత కుమార్తె ఆగామి, కుమారుడి ప్రియమ్ను కూడా హత్య చేశారు. ప్రియమ్కు నిందితుల్లో ఒకరితో పరిచయం ఉందని అనుమానిస్తున్నారు. ప్రియమ్, సిద్ధార్థ తమ్ముడు అపూర్వకు స్నేహితుడని, తమ గుర్తింపును బయటపెడతాడనే భయంతో అతడిని చంపి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

