Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్ నడుస్తోంది. చైనా నుంచి 20 J-10CE యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సుమారు 2.3 బిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందం ఖరారైతే, ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ కుదుర్చుకున్న భారీ రక్షణ ఒప్పందంగా నిలుస్తుంది. బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్ తమ దళాన్ని పూర్తిగా ఆధునీకీకరించుకోవడం, వాయుదళ సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. దీని కోసమే చైనా నుంచి ఫైటర్ జెట్ల కొనుగోలు కోసం సిద్ధమవుతోంది.
ముఖ్యంగా 2025 మేలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణలో పాకిస్తాన్ ఉపయోగించిన చైనీస్ తయారీ జే-10 యుద్ధ విమానాల పనితీరు కూడా బంగ్లాదేశ్ నిర్ణయాన్ని ప్రభావితం చేసిందని ఆ దేశ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా బంగ్లాదేశ్ 20 విమానాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ ఒప్పందం రూపుదాలిస్తే పాత తరానికి చెందిన యుద్ధ విమానాల స్థానంలో ఆధునిక మల్టీ రోల్ ఫైటర్ జెట్లను ప్రవేశపెట్టినట్టు అవుతుంది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ తన జె-10 విమానాలు చాలా బాగా లక్ష్యాలను ఛేదించినట్లు చెప్పుకొచ్చాయి. చైనీస్ మీడియా కూడా ఇదే కథనాన్ని ప్రచురించింది. అయితే, పాకిస్తాన్ తన వాదనలకు మాత్రం రుజువులు చూపించలేకపోయింది. భారత యుద్ధ విమానాలను జె-10 టార్గెట్ చేసిందనే వార్తల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇప్పటికే, పాక్ ఈ యుద్ధ విమానాలు ఉపయోగిస్తోంది, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా వీటిని కొనుగోలు చేస్తే దక్షిణాసియా దేశాల్లో చైనా ఆయుధ విక్రయాలు విస్తరించినట్లు అవుతుంది.
