Pakistan: పాకిస్తాన్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు టార్గెట్గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) దాడికి పాల్పడింది. బీఎల్ఏకు చెందిన మజీద్ బ్రిగేడ్ ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. రైల్వే ట్రాక్ సమీపంలో జరిగిన ఈ పేలుడులో కనీసం 23 మంది మరణించగా, 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడుతో రైలు బోగీ పూర్తిగా ధ్వంసమైంది. పట్టాల వెండి ఉన్న అనేక ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి.
చమన్ గేట్ సమీపంలో ఆదివారం ఉదయం ఈ దాడి జరిగింది. క్వెట్టా కంటోన్మెంట్ నుంచి సైనిక సిబ్బందిని తీసుకెళ్తున్న సమయంలో దాడి జరిగింది. మరణించిన వారిలో పాక్ ఆర్మీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. సంఘటన జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు, అధికారులు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి జియాండ్ బలూచ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
గతంలో కూడా ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ టార్గెట్గా బలూచ్ వీరులు దాడులకు పాల్పడ్డారు. ఏకంగా ఈ రైలునే హైజాక్ చేసి, పాక్ ఆర్మీ అధికారుల్ని ఊచకోత కోశారు. క్వెట్టా నుంచి పెషావర్ ప్రయాణించే ఈ రైలులో చాలా మంది ఆర్మీ, ఇంటెలిజెన్స్ అధికారులు ప్రయాణిస్తుంటారు. దీంతో చాలా సార్లు బీఎల్ఏ ఈ రైలును టార్గెట్ చేస్తోంది. తాజాగా జరిగిన సంఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.
