Twitter: పెప్సీ ట్విట్టర్ ఖాతా నుంచి “కోక్ ఈజ్ బెటర్” అంటూ ట్వీట్ .. కొత్త పాలసీతో చిక్కులు

Twitter

Twitter

As Fake Pepsi Account Tweets “Coke Is Better”, Concerns Grow Among Users: ట్విట్టర్‌ని సొంతం చేసుకున్న తర్వాత ఎలాన్ మస్క్ పూర్తిగా ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే పలువురు కీలక ఉద్యోగులను తొలగించిన మస్క్..బోర్డును కూడా రద్దు చేశారు. 50 శాతం ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు వెరిఫైడ్ అకౌంట్ యూజర్లు నెలకు 8 డాలర్లు చెల్లించాల్సేందే అని స్పష్టం చేశారు. భారతదేశంలో ట్విట్టర్ బ్లూ కోసం నెలకు రూ. 719 చెల్లించాలని తెలిపింది.

Read Also: Kanhaiya Kumar: హిందుత్వం అంటే ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ కాదు..

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కొత్త పాలసీ ట్విట్టర్ కు చిక్కులు తీసుకువస్తోంది. ఎవరు పడితే వారు డబ్బులు చెల్లించి ట్విట్టర్ వెరిఫైడ్ ఖాతాలను తీసుకుంటున్నారు. దీంతో అనేక ఫేక్ అకౌంట్లు క్రియేట్ అవుతున్నాయి. ప్రముఖ కంపెనీల పేరుతో అకౌంట్లు క్రియేట్ చేసి ఇష్టం వచ్చినట్లు ట్వీట్స్ చేస్తుండటం కంపెనీకి తలనొప్పిగా మారింది. ప్రపంచంలో రెండు ప్రత్యర్థి కూల్ డ్రింక్ గ్రూపులుగా పేరున్న పెప్సీ, కోక్ కంపెనీలు ఈ వివాదంలో ఇరుకున్నాయి. పెప్సీ పేరుతో ట్విట్టర్ వెరిఫైడ్ ఖాతా నుంచి ‘‘ కోక్ ఈజ్ బెటర్’’ అంటూ ట్వీట్ రావడం చర్చనీయాంశంగా మారింది. ఇలా నకిలీ అకౌంట్లతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. తాాజాగా ఈ సమస్యలు పెరుగుతుండటంతో ట్విట్టర్ 8 డాలర్ల సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను నిలిపివేసింది.

ట్విట్టర్ కొత్త పాలసీని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ ఫేక్ అకౌంట్ల తలనొప్పులు ఎదుర్కొంటోంది. డబ్బులు చెల్లించి ఇష్టారీతిగా బ్లూ టిక్ పొందుతున్నారు. ఈ ఘటనకు ముందు ప్రముఖ ఫార్మా కంపెనీ ఎలిలిల్లీ అండ్ కో, ఇన్సులిన్ ఫ్రీ అంటూ ట్వీట్ చేసింది. దీంతో కంపెనీ క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. చివరకు జీసస్ క్రైస్ట్ పేరుతో ట్విట్టర్ అకౌంట్ కూడా క్రియేట్ అయింది. దీనికి వేలల్లో ఫాలోవర్లు కూడా ఉన్నారు. ట్విట్టర్ అకౌంట్లు దుర్వినియోగానికి గురవుతున్నాయనే దానికి ఇది ఓ ఉదాహరణ. మరికొంతమంది ప్రపంచంలోనే ప్రముఖ నాయకులు, రాజకీయ పార్టీలు, కంపెనీల పేరుతో నకిలీ వెరిఫైడ్ ఖాతాలను క్రియేట్ చేశారు.