Site icon NTV Telugu

Ukraine Crisis: రష్యా దాడుల్లో 10 వేల మంది మృతి.. ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న యుద్ధం

Ukraine

Ukraine

Ukraine Crisis: రష్యా దాడుల్లో 10 వేల మంది ఉక్రెయిన్‌ వాసులు మృతి చెందారు. ఇప్పటికీ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తోంది. రష్యా సేనలు చేసిన 98 వేల యుద్ధ నేరాలను నమోదు చేసినట్లు ఉక్రెయిన్‌ తెలిపింది. ఇప్పటి వరకు రష్యా దాడుల్లో సుమారు 10 వేల మంది మృతి చెందారని ఉక్రెయిన్‌ అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్‌ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీరిలో 499 మంది పిల్లలు ఉన్నట్లు ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయంలో యుద్ధ నేరాల విభాగం అధికారి యూరియ్‌ బెల్‌సోవ్‌ తెలిపారు. ఉక్రెయిన్‌ భూభాగాలను తమ సేనలు తిరిగి ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Read also: HMDA: కోట్లు కురిపించిన కోకాపేట భూములు.. ఎకరం రూ.100 కోట్లు

యుద్ధంలో భాగంగా రష్యా సేనలు ఉక్రెయిన్‌లో చేసిన 98 వేల యుద్ధ నేరాలను తమ విభాగం నమోదు చేసిందని యూరియ్‌ తెలిపారు. ‘‘ గతేడాది ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్‌పై చేస్తున్న దాడిలో ఇప్పటి వరకు 10,749 మంది మరణించారు. 15,599 మంది గాయపడ్డారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్క మరియుపోల్‌లోనే 10 వేల మంది మరణించి ఉంటారని అంచనా వేస్తున్నాం’’ అని ఆయన వెల్లడించారు. గత నెలలో ఉక్రెయిన్‌లో మరణాలపై ఐక్యరాజ్య సమితి సైతం ఒక నివేదిక విడుదల చేసింది. రష్యా దాడుల్లో 500 మంది పిల్లలు సహా సుమారు 9 వేల మంది ఉక్రెయిన్‌ పౌరులు మృతి చెంది ఉంటారని ఆ నివేదిక అంచనా వేసింది. వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చూస్తే.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక అభిప్రాయపడింది. గురువారం ఉదయం ఉక్రెయిన్‌కు చెందిన ఆరు డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణశాఖ ప్రకటించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. బుధవారం ఉక్రెయిన్‌ నౌకాశ్రయాలే లక్ష్యంగా రష్యా దాడులు చేసింది. ఉక్రెయిన్‌ -రొమేనియా సరిహద్దులోని ఇజ్మాయెల్‌ దగ్గర డాన్యూబ్‌ నదిపై ఉన్న నౌకాశ్రయాన్ని డ్రోన్లు ప్రయోగించి ధ్వంసం చేసింది. ఈ దాడులపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version