Explainer: పెట్రోల్ రేట్ల దోపిడీ ఆగేదెప్పుడు..? ఇంధన ధరల మాయాజాలంపై కీలక రిపోర్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crude Prices: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగి వస్తున్నాయి. యుద్ధ మేఘాలు విడిపోయి, బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. కానీ, భారతీయ వినియోగదారుడి జేబుకు తూట్లు పొడుస్తున్న ఇంధన ధరల మంట మాత్రం చల్లారడం లేదు. గ్లోబల్ మార్కెట్లో ధరలు పెరిగితే గంటల్లో ఇక్కడ రేట్లు పెంచే చమురు సంస్థలు, అక్కడ ధరలు పతనమైనప్పుడు మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నాయి? అంతర్జాతీయంగా సంక్షోభం ముగిసినా, సామాన్యుడికి ఉపశమనం ఎందుకు లభించడం లేదు? ప్రభుత్వాలు చెబుతున్న కారణాల్లో నిజమెంత? ప్రభుత్వ రంగ చమురు సంస్థల నష్టాల వెనుక దాగున్న అసలు రహస్యం ఏంటి?
దేశీయంగా ధరలు ఎందుకు తగ్గడంలేదు?
అమెరికా-ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు పశ్చిమ ఆసియాను కుదిపేసినప్పుడు, ప్రపంచ సరఫరాకు కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ గుండా చమురు రవాణా నిలిచిపోతుందనే భయాలు వ్యక్తమయ్యాయి. ఆ సమయంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా బ్యారెల్కు 90 నుంచి 100 డాలర్ల స్థాయిని దాటి పరుగులు తీశాయి. అప్పటివరకు 68-69 డాలర్లుగా ఉన్న ధరలు అలా పెరగడంతో, ఆ యుద్ధ ప్రీమియం ప్రభావం భారత్పై తీవ్రంగా పడింది. అయితే, ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గి, సరఫరా పునరుద్ధరణ కావడంతో బ్రెంట్ క్రూడ్ ధర మళ్లీ 71-72 డాలర్ల శ్రేణికి పడిపోయింది. యుద్ధానికి ముందున్న ధరల స్థాయికి మార్కెట్ చేరుకున్నా, దేశీయంగా మాత్రం ఆ ఊరట కనిపించడం లేదు.
అంతర్జాతీయ సంక్షోభాన్ని సాకుగా చూపి, గత నెల రోజుల్లోనే భారతీయ వినియోగదారులపై చమురు సంస్థలు భారీగా భారాన్ని మోపాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే పెట్రోల్ ధరను లీటరుకు ఏకంగా 7రూపాయల 35 పైసలు, డీజిల్ ధరను లీటరుకు 7రూపాయల 53 పైసల చొప్పున నాలుగు విడతల్లో పెంచేశారు. గ్లోబల్ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెంచిన ఈ ధరలు, ఇప్పుడు అంతర్జాతీయంగా బ్యారెల్ ధర దాదాపు 30 శాతం వరకు తగ్గినప్పటికీ, రూపాయి కూడా తగ్గకపోవడం గమనించాల్సిన విషయం.
Also Read
- Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
- Joseph Vijay: టైమ్ టు టైమ్..ఫైల్ తర్వాత ఫైల్.. దళపతి మార్క్ రూలింగ్!
- ISIS-K: మసీదులు, పాఠశాలలు, మైనారిటీ వర్గాలే టార్గెట్.. తాలిబన్లకు అతిపెద్ద శత్రువు!
- Explainer: ప్రతి ముగ్గురిలో ఒకరికి సోకుతుంది.. కంటి చూపును దెబ్బతీస్తుంది.. గర్భంలోని శిశువుకూ ముప్పు!
ధరలు తగ్గించకపోవడానికి కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తమదైన కారణాలు చెబుతున్నాయి. భారతీయ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియంలు తమ నష్టాల పురాణాన్ని వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరలు గరిష్ట స్థాయికి చేరినప్పుడు తాము వినియోగదారులపై పూర్తి భారం వేయకుండా నష్టాలను భరించామని, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విక్రయాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలకు ఏకంగా 74వేల 781 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అధికారికంగా ప్రకటించారు. ఈ బకాయి నష్టాలను పూడ్చుకోవడానికే ప్రస్తుతం ధరలు తగ్గించడం లేదనేది ప్రభుత్వ వాదన.
ధరలు తగ్గించిన నయారా ఎనర్జీ:
ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల సాకు చూపుతుంటే, ప్రైవేట్ ఆయిల్ సంస్థలు మాత్రం ధరలు తగ్గిస్తూ సంచలనం సృష్టిస్తున్నాయి. చమురు దిగ్గజం ‘నయారా ఎనర్జీ’ జూలై 1 నుంచి తన నెట్వర్క్ వ్యాప్తంగా పెట్రోల్ ధరను లీటరుకు 5రూపాయలు, డీజిల్ ధరను లీటరుకు 3 రూపాయల చొప్పున తగ్గించి సంచలనం సృష్టించింది. దీనికి కారణం లేకపోలేదు. ప్రైవేట్ సంస్థలు గతంలో ప్రభుత్వ రంగ సంస్థల ధరల కంటే ఎక్కువ రేటుకు ఇంధనాన్ని విక్రయించి లాభాలు గడించాయి, తద్వారా క్రూడ్ ధరలు తగ్గగానే వేగంగా స్పందించే వెసులుబాటును పొందాయి. కానీ ప్రభుత్వ సంస్థలు మాత్రం నిబంధనల సుడిగుండంలో చిక్కుకుని సామాన్యుడికి తక్షణ ఉపశమనాన్ని దూరం చేస్తున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపులో తాత్సారం ప్రదర్శిస్తున్న ఆయిల్ కంపెనీలు, గ్యాస్, ఏటీఎఫ్ ధరల విషయంలో మాత్రం వెంటనే నిర్ణయం తీసుకున్నాయి.గ్లోబల్ మార్కెట్ ప్రభావంతో జూలై 1 నుంచి విమాన ఇంధనం ధరను లీటరుకు 5 రూపాయల వరకు తగ్గించారు. అలాగే 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను దేశవ్యాప్తంగా ఏకంగా 183రూపాయల 50 పైసలు తగ్గించారు. ఏటీఎఫ్, కమర్షియల్ గ్యాస్ ధరలను మార్కెట్ ఒడిదుడుకులకు అనుగుణంగా వేగంగా సవరించే చమురు సంస్థలు, సామాన్యుడు వాడే పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల విషయంలో మాత్రం ఎందుకు కాలయాపన చేస్తున్నాయనేది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఇండియన్ ఆయిల్ రిఫైనరీలు ప్రతిరోజూ స్పాట్ మార్కెట్లో ముడి చమురును కొనవు. దీర్ఘకాలిక ఒప్పందాలు, స్పాట్ పర్చేజెస్ ద్వారా ముడి చమురును సేకరిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ నుండి ఈ చమురు సరుకు భారతీయ రిఫైనరీలకు చేరడానికి కనీసం 2 నుండి 6 వారాల సమయం పడుతుంది. అంటే, చమురు సంస్థలు ప్రస్తుతం గతంలో గరిష్ట ధరల వద్ద కొన్న ముడి చమురు నిల్వలను ప్రాసెస్ చేస్తున్నాయి. ఆ పాత నిల్వలు కరిగిపోతే తప్ప, ప్రస్తుత తక్కువ ధరల ప్రయోజనం రిటైల్ మార్కెట్కు బదిలీ కాదనేది సాంకేతిక కారణం. అయితే అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు మాత్రం ఈ 2-6 వారాల నిబంధన ఎందుకు వర్తించదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా ఉంటేనే దేశీయంగా ఇంధన ధరల తగ్గింపుపై ఆలోచిస్తామని కేంద్ర మంత్రి చెబుతున్నారు. మార్కెట్ గతిశీలతను బట్టి సామాన్యుడిపై భారం వేయడంలో ఉన్న వేగం, అతనికి ఉపశమనం అందించడంలో ఎందుకు లోపిస్తుందనేది ఇక్కడి పచ్చి నిజం. ధరల స్థిరత్వం కొనసాగి ప్రభుత్వాలు, చమురు సంస్థలు కరుణ చూపితేనే భారత్లో పెట్రో భారం తగ్గుతుంది. లేదంటే అంతర్జాతీయ పతనం కేవలం కాగితాలకే పరిమితం అవుతుంది.
: CLN RAJU (EDITOR- NTV DIGITAL)
- Tags
- Explainers in Telugu
తాజావార్తలు
-
Explainer: పెట్రోల్ రేట్ల దోపిడీ ఆగేదెప్పుడు..? ఇంధన ధరల మాయాజాలంపై కీలక రిపోర్ట్!
-
E20 Ethanol Blending: E20 పెట్రోల్పై అపోహలకు కేంద్రం చెక్.. ఇంజిన్కు ఎలాంటి నష్టం లేదు, 10 అంశాలతో వివరణ
-
Vaibhav Sooryavanshi Debut: ఆడించమని వైభవ్ సూర్యవంశీకి చెప్పండి!
-
FIFA World Cup 2026 ముగిసిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లు.. రౌండ్ ఆఫ్ 16లో ఏఏ జట్లు తలపడనున్నాయంటే.?
-
Allu Arjun: బన్నీ వదిలేసుకున్నవన్నీ హిట్లే?
ట్రెండింగ్
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!