Shiv Sena 60 Years: హిందూహృదయ్ సామ్రాట్ బాల్ ఠాక్రే స్థాపించిన ‘శివసేన’ నేటితో సరిగ్గా 60 వసంతాలు పూర్తి చేసుకుని వజ్రోత్సవ వేడుకలకు చేరుకుంది. 1966 జూన్ 19న ముంబైలోని చారిత్రాత్మక శివాజీ పార్క్లో బాల్ ఠాక్రే కొబ్బరికాయ కొట్టి ఈ పార్టీని ప్రారంభించారు. నాడు కొద్దిమంది మద్దతుదారులు, వేలాది మంది ‘మరాఠీ మానుస్’ సాక్షిగా పురుడుపోసుకున్న ఈ ప్రాంతీయ మహావృక్షం.. సరిగ్గా ఆరు దశాబ్దాల తర్వాత నేడు రెండు ముక్కలుగా చీలిపోయింది. విచిత్రమేమిటంటే.. బాల్ ఠాక్రే స్థాపించిన అసలైన ‘శివసేన’ పేరు, దాని సాంప్రదాయక ‘విల్లు-బాణం’ గుర్తు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వశమయ్యాయి. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే వద్ద తండ్రి పెట్టిన పార్టీ పేరు కానీ, గుర్తు కానీ మిగల్లేదు. వారి పార్టీ ఇప్పుడు ‘శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే)’గా రూపాంతరం చెంది, ‘మశాల్’ (దివిటీ) గుర్తుతో మనుగడ సాగిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ దివిటీ సైతం దాదాపు ఆరిపోయే స్థితికి చేరుకుంది. శివసేనను స్థాపించినప్పుడు బాల్ ఠాక్రే రెండు ప్రధాన ఆశయాలను నిర్దేశించుకున్నారు. ఒకటి ‘మరాఠీ అస్తిత్వం’, రెండోది ‘హిందుత్వ సిద్ధాంతం’. కానీ నేడు ఉద్ధవ్ ఠాక్రే తన తండ్రి నుంచి వచ్చిన ఈ రెండు రాజకీయ వారసత్వాలను కాపాడుకోవడానికి తీవ్రంగా పోరాడాల్సి వస్తోంది.
బాల్ ఠాక్రే పార్టీని వీడతానన్న నాటి సంచలనం
బాల్ ఠాక్రే హయాంలో శివసేన సాధించిన శిఖరాగ్రాల నుంచి ఉద్ధవ్ హయాంలో ఎదుర్కొంటున్న ఉనికి సంక్షేమం వరకు సాగిన ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే.. 1992 జూలై 18న జరిగిన ఒక చారిత్రాత్మక సంఘటనను గుర్తు చేసుకోవాలి. అప్పట్లో శివసేనలో మొదటిసారి తిరుగుబాటు జరిగింది. ఈ తరుణంలో.. బాల్ ఠాక్రే పార్టీని ఒక సొంత ఆస్తిలా చూస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో కలత చెందిన బాల్ ఠాక్రే, పార్టీ ముఖపత్రం ‘సామ్నా’లో ఒక వ్యాసం రాస్తూ.. తాను శివసేన నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ వార్తతో మహారాష్ట్రవ్యాప్తంగా ఉన్న శివసైనికుల్లో తీవ్ర కలకలం రేగింది. ముంబైలోని శివసేన ప్రధాన కార్యాలయం వెలుపల లక్షలాది మంది సైనికులు తరలివచ్చి.. ‘బాలాసాహెబ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి’ అని కన్నీటితో వేడుకున్నారు. శివసైనికులకు తనపై ఉన్న ఆ అచంచలమైన ప్రేమాభిమానాలను చూసి బాల్ ఠాక్రే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోక తప్పలేదు.
అప్పటి ‘రైజింగ్’ శివసేన.. ఇప్పటి పరిస్థితి
బాల్ ఠాక్రే బతికున్నంత కాలం మహారాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు వారి నివాసమైన ‘మాతోశ్రీ’ మాత్రమే. శివసేన అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ముంబై నగర రిమోట్ కంట్రోల్ బాలాసాహెబ్ చేతుల్లోనే ఉండేది. ‘మాతోశ్రీ’ నుంచి చిన్న సంకేతం వస్తే చాలు.. ముంబై స్థంభించిపోయేది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం స్వయంగా ముంబై పోలీసులు సైతం శివసేన ప్రముఖుడిని అభ్యర్థించాల్సిన పరిస్థితి ఉండేది. కోవిడ్ లాక్డౌన్ కంటే ముందే.. ముంబై లోకల్ రైళ్లకు బ్రేక్ వేయగల ఏకైక శక్తి బాల్ ఠాక్రేకే ఉండేదని ఇప్పటికీ ముంబై ప్రజలు సరదాగా చెప్పుకుంటారు. కానీ, నేడు బాల్ ఠాక్రే శతాబ్ది జయంతి ఉత్సవాల వేళ, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీ రెండోసారి ఘోరమైన చీలికను ఎదుర్కొంటోంది. ఆయన కుడిభుజం లాంటి సంజయ్ రౌత్ కేవలం ప్రత్యర్థులపై వీధి రౌడీల తరహాలో విమర్శలు చేయడానికే పరిమితమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తండ్రీకొడుకుల రాజకీయ శైలిలో వ్యత్యాసం
బాల్ ఠాక్రేకు, ఉద్ధవ్ ఠాక్రేకు రాజకీయ వ్యూహాల్లోనూ, వ్యక్తిత్వంలోనూ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. బాల్ ఠాక్రే తన జీవితంలో ఎన్నడూ అధికార పీఠాన్ని ఆశించలేదు. ఆయన ఎప్పుడూ ‘కింగ్’ అవ్వాలని అనుకోలేదు, ‘కింగ్మేకర్’ గానే ఉండటానికి ఇష్టపడ్డారు. శివసైనికులు బాలాసాహెబ్ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడ్డారంటే.. ఆయన దశాబ్దాల పాటు క్షేత్రస్థాయిలో చేసిన పోరాటమే దానికి కారణం. కానీ, ఉద్ధవ్ ఠాక్రేకు అలాంటి క్షేత్రస్థాయి పోరాట అనుభవం లేదు. తండ్రి వారసత్వంతో నేరుగా పార్టీ అగ్రపీఠంపై కూర్చున్నారు. ప్రారంభంలో ఆయన రాజకీయాలకు దూరంగా తన వ్యక్తిగత అభిరుచులకే ప్రాధాన్యత ఇచ్చారు.
2003 నుంచి పార్టీలో ఉద్ధవ్ జోక్యం పెరిగిన తర్వాత, శివసేన ఏకంగా నాలుగు సార్లు పెద్ద తిరుగుబాట్లను చవిచూసింది. ఉద్ధవ్పై తిరుగుబాటు చేసిన ప్రతి ఒక్కరి వాదన ఒక్కటే.. ఆయనలో బాల్ ఠాక్రే లక్షణాలు ఏమాత్రం లేవని, అయినా సరే అందరూ తనను బాలాసాహెబ్లాగే గౌరవించాలని ఉద్ధవ్ ఆశిస్తారని అసమ్మతి నేతలు ఆరోపిస్తుంటారు. బీజేపీతో కలిసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ఉద్ధవ్ ఠాక్రే అనూహ్యంగా ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపి స్వయంగా ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాకుండా తన సొంత మంత్రివర్గంలో కొడుకు ఆదిత్య ఠాక్రేకు మంత్రి పదవి కట్టబెట్టారు. ఉద్ధవ్ నిర్ణయాలపై ఆయన భార్య రష్మి ఠాక్రే, కుమారుడు ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్లతో కూడిన ఒక ప్రత్యేక కోటరీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఇది బాలాసాహెబ్ ఇమేజ్ ముందు ఉద్ధవ్ను బలహీనంగా మార్చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తారు.
శివసేనలో ఆరు చారిత్రాత్మక చీలికలు
శివసేన చరిత్రలో ఇప్పటివరకు మొత్తం 6 సార్లు భారీ విభాగాలు లేదా తిరుగుబాట్లు జరగ్గా.. అందులో నాలుగు సార్లు ఉద్ధవ్ ఠాక్రే హయాంలోనే జరగడం గమనార్హం.
1. ఛగన్ భుజబల్ (1991): బాల్ ఠాక్రే బతికుండగానే జరిగిన మొదటి తిరుగుబాటు ఇది. భుజబల్ ఆ తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీల ద్వారా రాజకీయాల్లో కొనసాగారు. విచిత్రమేమిటంటే, ఆ తర్వాత కాలంలో అదే భుజబల్ను ఉద్ధవ్ తన మంత్రివర్గంలో చేర్చుకోవాల్సి వచ్చింది.
2. గణేష్ నాయక్ (1999): రెండో తిరుగుబాటు చేసిన గణేష్ నాయక్ వల్ల నవీ ముంబై రీజియన్లో శివసేనకు గట్టి దెబ్బ తగిలింది.
3. నారాయణ్ రాణే (2005): శివసేనలో ఉద్ధవ్ ప్రవేశం తర్వాత తన రాజకీయ భవిష్యత్తుకు ముప్పు పొంచి ఉందని భావించిన రాణే మూడో తిరుగుబాటు చేశారు. ఆయన నిష్క్రమణతో కొంకణ్ తీర ప్రాంతంలో శివసేన బాగా బలహీనపడింది. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు.
4. రాజ్ ఠాక్రే (2006): బాల్ ఠాక్రే మేనల్లుడు రాజ్ ఠాక్రే తిరుగుబాటు అత్యంత కీలకమైంది. బాలాసాహెబ్ తన రాజకీయ వారసత్వాన్ని రాజ్ ఠాక్రేకే అప్పగిస్తారని సాధారణ శివసైనికులు భావించారు. ఎందుకంటే రాజ్ ఠాక్రే హావభావాలు, దూకుడు చాలావరకు బాలాసాహెబ్ను పోలి ఉంటాయి. కానీ బాల్ ఠాక్రే కొడుకు వైపే మొగ్గు చూపడంతో రాజ్ ఠాక్రే ‘మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS)’ను స్థాపించారు.
5. ఏకనాథ్ షిండే (2022): శివసేనకు కోలుకోలేని కోలుకోలేని దెబ్బ ఏకనాథ్ షిండే రూపంలో తగిలింది. 40 మంది ఎమ్మెల్యేలతో విడిపోయిన షిండే, బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన బీఎంసీ (BMC) ఎన్నికల్లో షిండే వర్గమే ‘అసలైన శివసేన’ అని ఓటర్లు తీర్పునిచ్చారు. దీంతో ఉద్ధవ్ సేన ముంబైలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
6. ప్రస్తుత ఎంపీల తిరుగుబాటు (2026): ఇప్పుడు శివసేన (యూబీటీ)కి చెందిన 9 మంది లోక్సభ ఎంపీల్లో ఆరుగురు ఎంపీలు షిండే వైపు వెళ్లేందుకు సిద్ధమవడంతో, మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధవ్ ఠాక్రే తన ఉనికిని కాపాడుకోవడానికి అత్యంత క్లిష్టమైన పోరాటాన్ని ఎదుర్కొంటున్నారు. ఆరు పదుల వయసులో శివసేన మైలురాయిని చేరుకున్న వేళ, పార్టీ వ్యవస్థాపకుడి కుటుంబం ఈ స్థాయి సంక్షోభంలో పడటం మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక విషాదకరమైన మలుపు.

