IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థలు ఐఐటీలు. ఇక్కడ సీటు సాధించడం ఎంతోమంది కల. కానీ ఆ కలే కొందరి పాలిట శాపంగా మారుతోంది. ఢిల్లీ ఐఐటీలో మరో విద్యార్థి ఆ*త్మహత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎంఎస్సీ ఫిజిక్స్ విద్యార్థి రిషికేష్ కుమార్ బలవన్మరణం క్యాంపస్ లో ఉద్రిక్తతలకు దారితీసింది. వరుస మరణాలు విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేశాయి. ఐఐటీల్లో అసలు ఏం జరుగుతోంది? ఢిల్లీ క్యాంపస్ లో ఐదు రోజులుగా ఆందోళనలు ఎందుకు సాగుతున్నాయి? విద్యార్థులను బలి తీసుకుంటున్న కారణాలేంటి?
ఐఐటీ ఢిల్లీలో ఆ*త్మహత్యల పరంపర ఆగడం లేదు. మూడేళ్ల వ్యవధిలో ఎనిమిది మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం ఐఐటీల దుస్థితికి అద్దం పడుతోంది. ఆగస్టు 22న రిషికేష్ కుమార్ అనే 31 ఏళ్ల ఎంఎస్సీ విద్యార్థి లెక్చర్ హాల్ కాంప్లెక్స్ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి చనిపోయాడు. ఈ ఘటనతో రగిలిపోయిన విద్యార్థులు ఆగస్టు 24 నుంచి క్యాంపస్ లో భారీ నిరసనలకు దిగారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా ఐదు రోజులుగా ఈ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మరణంపై స్వతంత్ర విచారణ జరిపించడంతో పాటు బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఆందోళనకారులు పట్టుబడుతున్నారు.
విద్యార్థుల ఆందోళనలు తీవ్రం కావడంతో యాజమాన్యం కొంత దిగివచ్చింది. ఈ ఘటనపై విచారణకు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి ముక్తా గుప్తా నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. కానీ విద్యార్థులు మాత్రం సంస్థ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ కమిటీతో విచారణ పారదర్శకంగా జరగదన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రొఫెసర్ల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రిషికేష్ చనిపోయిన తర్వాత ఓ ఫ్యాకల్టీ సభ్యుడు అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో నిరసనకారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ హెచ్చరించడం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.
Also Read
రిషికేష్ మరణం వెనుక కేవలం మానసిక ఒత్తిడి మాత్రమే లేదు. వ్యవస్థాగత వైఫల్యాలు అతడిని బలి తీసుకున్నాయి. క్యాంపస్ లో కనీస వసతి కోసం రిషికేష్ చాలా ఇబ్బందులు పడ్డాడు. జులైలో హాల్టల్ రూమ్ కేటాయించినట్టే కేటాయించి… ఆగస్టులో ఆ జాబితా నుంచి పేరు తొలగించారు. ప్రాజెక్ట్ వర్క్ విషయంలో కూడా తోడుగా ఎవరూ దొరక్క తీవ్ర ఒంటరితనం అనుభవించాడు. పేద విద్యార్థులకు క్యాంపస్ లలో ఇలాంటి వివక్ష నిత్యకృత్యంగా మారింది. భాషాపరమైన ఇబ్బందులు, సామాజికంగా ఎదురయ్యే ఒంటరితనం వారిని తీవ్ర నిరాశలోకి నెట్టేస్తున్నాయి. పైకి అత్యుత్తమ విద్యాసంస్థలుగా కనిపిస్తున్నా, లోపల మాత్రం సమానత్వం లోపించిందన్న విమర్శలున్నాయి.
కేవలం ఐఐటీ ఢిల్లీలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు ఈ భయానక వాస్తవాన్ని కళ్లకు కడుతున్నాయి. 2024లో దేశవ్యాప్తంగా 14488 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పదేళ్ల కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఏకంగా 62 శాతం పెరిగాయి. ఈ సమస్యను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఒక మహమ్మారిగా అభివర్ణించింది. దేశంలోని 65 శాతం ఉన్నత విద్యాసంస్థల్లో కనీస మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో లేవని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 73 శాతం సంస్థల్లో కనీసం పూర్తిస్థాయి మానసిక వైద్యులు కూడా లేకపోవడం విచారకరం.
ఉన్నత విద్య, కెరీర్పై ఎన్నో కలలతో ఐఐటీల్లో అడుగుపెడుతున్న విద్యార్థులు చివరకు శవాలుగా మారుతుంటే యాజమాన్యాలు కేవలం కమిటీలు వేసి చేతులు దులుపుకుంటున్నాయి. అడ్మిషన్ల సమయంలో ఉండే ఉత్సాహం చదువు పూర్తయ్యేదాకా కొనసాగేలా మార్గనిర్దేశం చేసే మెకానిజం క్యాంపస్ లలో ఉండాలి. చదువుల ఒత్తిడికి తోడు సామాజిక వివక్ష తోడైతే విద్యార్థులు తట్టుకోలేరు. మానసిక ఆరోగ్య నిపుణులను ప్రతి క్యాంపస్ లో తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి. యాజమాన్యం, ప్రొఫెసర్లు విద్యార్థుల పట్ల మరింత సానుభూతితో వ్యవహరించాలి. ర్యాంకులు సాధించడమే కాదు.. విద్యార్థులు ప్రాణాలతో బయటకు రావడం కూడా ముఖ్యమే అన్న విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి.
- Tags
- Explainers in Telugu
- IIT
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!