NTV Telugu Site icon

Human Sacrifice: కలలో దేవత చెప్పిందని.. షాప్‌కీపర్‌ని నరబలి ఇచ్చిన మహిళ..

Crime

Crime

Human Sacrifice: హర్యానాలో దారుణం జరిగింది. దేవత కలలో కనిపించి నరబలి కోరిందని చెబుతూ ఓ మహిళ యువకుడిని హత్య చేసింది. బుధవారం సాయంత్రం ప్రధాన నిందితురాలిగా ఉన్న ప్రియా ఇంట్లో మహేష్ గుప్తా(44) మృ‌తదేహం లభ్యమైంది. బాధితుడు గతంలో మహిళ దుకాణంలో పనిచేసినట్లు తెలిసింది. హత్యకు పాల్పడిన ప్రియాతో పాటు ఆమె సోదరుడు హేమంత్, కోడలు ప్రీతిలను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై పోలీస్ కేసు.. కారణం ఇదే..

కచా బజార్ అంబాలా కంటోన్మెంట్‌కి చెందిన గుప్తా, ఓ షాప్‌కి ఓనర్. ఇతని కాళ్లు, చెవుల వెనక గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితులను విచారిస్తుండగా నరబలి గురించి వెల్లడించినట్లు పోలీసులు చెప్పారు. గత నాలుగైదు రోజులుగా తన కలలో నరబలి కోరుతూ దేవత కనిపిస్తోందని ప్రియా పోలీసులకు చెప్పింది. మృతుడి సోదరుడి ఫిర్యాదు ప్రకారం.. గుప్తా ప్రియాను తన సోదరిగా పరిగణించే వాడని, బుధవారం తన దుకాణం నుంచి కొన్ని వస్తువులను ఆమె నివాసానికి డెలివరీ చేయడానికి వెళ్లాడని పేర్కొన్నాడు.

అయితే, దీని తర్వాత గుప్తా తిరిగిరాకపోవడం, ఫోన్ కాల్‌కి సమాధానం ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం వెతికి పోలీసుకు ఫిర్యాదు చేశారు. ప్రియ ఇంటి సమీపంలో గుప్తా స్కూటర్ గమనించడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ప్రియా ఇంటి తలుపును తట్టిన సమయంలో ఎలాంటి స్పందన రాలేదని గుప్తా సోదరుడు తెలిపారు. బలవంతంగా తలుపు తెరిసిన సమయంలో ప్రియా, ప్రీతి, హేమంత్‌లు గుప్తా మెడకు స్కార్ఫ్ కట్టి లాగేందుకు ప్రయత్నిస్తుండటం చూశామని ఫిర్యాదిదారు తెలిపారు. గుప్తాను ఆస్పత్రికి తరలించే సమయానికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.