West Bengal: పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో కాంగ్రెస్ నేత, ఆయన 24 ఏళ్ల కుమారుడిని కాల్చి చంపిన సంఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బెంగాల్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు, నదియా జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అనిసూర్ రెహ్మన్(50), అతడి కుమారుడు అబు సిఫియాన్తో కలిసి బెతువాదహరి నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
శనివారం నాగాది రైల్వే గేట్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు వారి కారుపై కాల్పులు జరిపినట్లు సమాచారం. ముందుగా కాల్పులు జరిపిన దుండగులు అనంతరం పదునైన ఆయుధాలతో ఇద్దరిపై దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం తెలియజేస్తోంది. ఈ దాడిలో అనిసూర్ రెహ్మాన్, ఆయన కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. రెహ్మాన్ ఆ ప్రాంతంలో సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్నారు. చాలా కాలంగా పార్టీలో వివిధ కీలక పదవులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనను ఖండించారు .బెంగాల్లో శాంతిభద్రతలపై ప్రశ్నలు లేవనెత్తారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ప్రజల భద్రత, స్వేచ్ఛగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించే హక్కును హరిస్తున్నా్యని అన్నారు. ఈ ఘటనపై నిష్పాక్షిక, న్యాయమైన దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

