డ్రగ్స్ వినియోగంలో ఏపీలోని మెగాసిటీ విశాఖ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే డ్రగ్స్, గంజాయి కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. తాజాగా MDMA డ్రగ్స్ తెప్పించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేరుగా బెంగళూరు నుంచి విశాఖకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు శ్రీవాత్సవ్. విశాఖలోని మురళీనగర్ NGO కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతని తండ్రి నావికాదళంలో పని చేస్తున్నాడు. శ్రీవాత్సవ్.. బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఇతని సిగరెట్, మద్యం తాగే అలవాటు ఉంది. ఐతే ఇంటర్ చదువుతున్నప్పుడు స్నేహితుల నుంచి గంజాయి, డ్రగ్స్ అలవాటు చేసుకున్నాడు. ముఖ్యంగా ఇంటర్లో లోహిత్ యాదవ్ అనే యువకుడితో శ్రీవాత్సవ్కు స్నేహం కుదిరింది. అతడు తరచూ డ్రగ్స్ తీసుకునేవాడు. లోహిత యాదవ్ నుంచి డ్రగ్స్ను తీసుకోవడం మొదలుపెట్టాడు శ్రీవాత్సవ్. గతంలోనూ డ్రగ్స్తో శ్రీవాత్సవ్ విశాఖ మూడో పట్టణ పోలీసులకు చిక్కాడు. అప్పట్లో కేసు కూడా నమోదైంది..
ఇక ఏడాది క్రితం విశాఖకు చెందిన బొడ్డేపల్లి హవీల డిలైట్తో శ్రీవాత్సవకు పరిచయం ఏర్పడింది. ఆమె తమ్ముడి ద్వారా ఏర్పడిన స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరికీ డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండటంతో ఆ ప్రేమ మత్తుగా మారింది. శ్రీవాత్సవ్ తరహాలోనే హవీల సిగరెట్, మద్యం తాగడంతో పాటు డ్రగ్స్ తీసుకుంటుంది. విశాఖపట్నం సీబీఎం కాంపౌండ్ ప్రీమియర్ ప్యారడైజ్ ప్రాంతానికి చెందిన బొడ్డేపల్లి హవీల తండ్రి శామ్యూల్ సివిల్ ఇంజనీర్. ఆమె గతేడాది నాగపూర్లోని ఐఐఎంలో ఎంబీఏ పూర్తిచేసింది. తర్వాత పూణెలో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా మూడు నెలలు పనిచేసింది. తర్వాత ఉద్యోగం మానేసి వైజాగ్లోనే స్థిరపడింది. సివిల్ ఇంజనీర్గా ఉన్న తండ్రికి సహాయకురాలిగా ఉంటోంది. ఎంబీఏ చదువుతున్నప్పుడే స్నేహితుల ద్వారా సిగరెట్, మద్యం తాగడం, డ్రగ్స్ తీసుకోవడం అలవాటు చేసుకుంది…
శ్రీవాత్సవ్తో పాటు మరికొంతమంది స్నేహితులు గోవాలో ‘మాన్సూన్ బ్లాస్ట్’ పేరుతో మ్యూజికల్ ఫెస్టివల్ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో పాల్గొనడానికి శ్రీవాత్సవ్ ఆగస్ట్ 14న విశాఖ నుంచి గోవా వెళ్లాడు. అక్కడ 6 రోజులు ఉన్నాడు. అక్కడి నుంచి MDMA డ్రగ్ కొనడానికి బెంగళూరు వెళ్లాడు. అక్కడికి హవీల డిలైట్ను పిలిపించుకున్నాడు. శ్రీవాత్సవ్ 21న గోవా నుంచి బెంగళూరుకు వెళ్లాడు. అదే సమయానికి హవీల అక్కడికి చేరుకుంది. ఇద్దరూ కలిసి బెంగళూరులో శ్రీవాత్సవ్ స్నేహితుడు ముత్యాల తరుణ్ రూమ్లో ఉన్నారు. శ్రీవాత్సవ్ తన స్నేహితుల ద్వారా మల్లెల మధుసూదన్రెడ్డి అలియాస్ మద్ది నుంచి 2 గ్రాముల MDMA డ్రగ్ను రూ.4,700కు కొన్నాడు. ఈ డబ్బును హవీల ఫోన్పే ద్వారా పంపింది. తర్వాత శ్రీవాత్సవ్ వాట్సాప్కు మద్ది డ్రాప్ పాయింట్ పంపాడు. అక్కడికి వెళ్లి తీసుకున్న శ్రీవాత్సవ్, హవీల డ్రగ్స్ సేవించారు..
మరోవైపు శ్రీవాత్సవ్, హవీల బెంగళూరులో ఉండగానే.. వైజాగ్లో ఉన్న లోహిత్ యాదవ్ నుంచి ఫోన్ వచ్చింది. వచ్చేటప్పుడు 20 గ్రాముల MDMA తీసుకురావాలని చెప్పాడు. తాను చెప్పినట్టు చేస్తే అందులో నుంచి 2 గ్రాములు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. లోహిత్ యాదవ్ వాట్సాప్ కాల్చేసి బెంగళూరులోని సింగసండ్ర మెట్రో రైల్వేస్టేషన్ వద్ద ఉన్న డ్రాప్పాయింట్ చిరునామా చెప్పాడు. దాని లొకేషన్ను శ్రీవాత్సవ్ వాట్సాప్కు పంపాడు. అక్కడ డ్రగ్స్ వ్యాపారులు MDMAను సిగరెట్ ప్యాకెట్లలో పెట్టి అక్కడ ఉంచారు. వాటిని తీసుకురావాలని లోహిత్ యాదవ్ చెప్పాడు…
లోహిత్ చెప్పిన డ్రాప్ పాయింట్కు వెళ్లిన శ్రీవాత్సవ్, హవీల అక్కడి నుంచి 20 జిప్ కవర్ ప్యాకెట్ల్లో ఉంచిన MDMA తీసుకున్నారు. అందులో ఒక ప్యాకెట్ను వారిద్దరూ తాగారు. ఆగస్ట్ 27న ఇద్దరూ కలిసి బెంగళూరు నుంచి వైజాగ్కు బస్ టికెట్లు బుక్ చేసుకున్నారు. డ్రగ్ ఉన్న 19 కవర్లలో 9 ప్యాకెట్లను హవీలకు ఇచ్చాడు. మిగిలిన ప్యాకెట్లను శ్రీవాత్సవ్ తన వద్ద ఉంచుకున్నాడు. ఇద్దరూ కలిసి బెంగళూరు-విశాఖపట్నం బస్సు ఎక్కారు. ఈగల్ టీమ్కు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు.. బస్సు విజయవాడలోని మహానాడు వద్దకు రాగానే ఆపి తనిఖీ చేయగా.. వీరిద్దరూ పట్టుబడ్డారు… వారిద్దరి దగ్గర నుంచి సమాచారం సేకరించిన పోలీసులు.. లోహిత్ యాదవ్ను కూడా అరెస్ట్ చేశారు. లోహిత్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే పార్టీ కోసమే ఈ డ్రగ్ను తెప్పిస్తున్నట్టు తెలిసింది…