తిరుపతిలో ప్రేమజంటపై నడిరోడ్డుపై దాడి తీవ్ర కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు చందు, శివస్నేహ రక్షణ కోరుతూ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్తుండగా యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. నవవధువు మెడలోని తాళిబొట్టు తెంచి, యువకుడిపై దాడికి దిగారు. భయంతో సమీప కార్యాలయంలో ఆశ్రయం పొందిన దంపతులను స్థానికులు ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించారు. రాయచోటి పోలీసులు కేసు నమోదు చేయగా..పోలీసులు తమ కుటుంబ సభ్యులను అక్రమంగా తీసుకెళ్లారని చందు ఆరోపిస్తున్నాడు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు రక్షణ కోసం ఎస్పీ కార్యాలయానికి వెళ్తుండగా.. ఒక్కసారిగా యువతి కుటుంబ సభ్యులు అడ్డగించి భౌతిక దాడులకు దిగారు. తీవ్ర భయాందోళనకు గురైన బాధితులు సమీపంలోని కార్యాలయంలోకి పరుగెత్తి ప్రాణాలు దక్కించుకున్నారు. స్థానికులు వారిని సురక్షితంగా ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించారు.
అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం కేకల దొడ్డిపల్లికి చెందిన శివస్నేహ, సూళ్లూరుపేట మండలం మతిమూడి గ్రామానికి చెందిన చందు ఓ కోచింగ్ సెంటర్లో పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో జులై 19న ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అయితే, శివస్నేహ కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు రాయచోటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు విచారణ పేరుతో రాయచోటి పోలీసులు తన కుటుంబ సభ్యులపై వేధింపులకు దిగుతున్నారని యువకుడు చందు తీవ్రంగా ఆరోపించాడు. 3 రోజుల క్రితమే తన తల్లి, పెద్దమ్మ, మేనమామలను పోలీసులు తీసుకెళ్లారని.. వారి ఆచూకీ కూడా తెలపడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు చందు. ఈ అన్యాయంపై జిల్లా ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా.. మార్గమధ్యలోనే యువతి బంధువులు తమపై విచక్షణారహితంగా దాడి చేశారని చెప్పాడు.
దాడి సమయంలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. యువతి కుటుంబ సభ్యులు నవవధువు మెడలోని తాళిబొట్టును తెంచివేసి, చందుపై దాడి చేశారని బాధితులు వాపోయారు. ప్రశాంతంగా ఉండే ఎస్పీ ఆఫీస్ పరిసర ప్రాంతంలో నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. తక్షణమే స్పందించిన స్థానికులు, దంపతులకు ఆశ్రయం కల్పించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పోలీస్ స్టేషన్లో నవవధువు శివస్నేహ స్టేట్మెంట్ను అధికారికంగా నమోదు చేసుకున్నారు. నవ దంపతులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిన పోలీసులు.. ఘటనకు సంబంధించిన వివరాలను రాయచోటి పోలీసులకు సమాచారం అందించారు.
ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న యువ జంటలపై బంధువులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులకు పాల్పడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నవ దంపతులు కోరుతున్నారు.

