MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..

  • పూణేలో మటన్ వండే విషయంలో కుటుంబ వివాదం విషాదం.
  • శ్రావణ మాసంలో మటన్ వండాలని పట్టుబట్టిన కొడుకు.
  • మాంసాహారం వండేందుకు తల్లిదండ్రులు నిరాకరణ.
  • తండ్రి దాడి చేయడంతో కొడుకు మృతి.
Crime

Crime

MAHARASHTRA: ‘‘మటన్’’ వివాదం సొంత కొడుకు హత్యకు కారణమైంది. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. శ్రావణ మాసంలో మటన్ వండటం విషయంలో జరిగిన గొడవ యువకుడి ప్రాణాలను తీసింది. వార్జే-మల్వాడి ప్రాంతంలో 30 ఏళ్ల మహేష్ భగవాన్ గైక్వాడ్‌ను తండ్రి కొట్టి చంపారు. పోలీసులు నిందితుడైన 64 ఏళ్ల తండ్రి భగవాన్ సూర్యభాన్ గైక్వాడ్‌ను, అతని 60 ఏళ్ల తల్లి పార్వతి భగవాన్ గైక్వాడ్‌ను అరెస్టు చేశారు.

ఆగస్టు 25న రాత్రి ఈ హత్య జరిగింది. పోలీసులు విచారణ ప్రకారం.. మృతుడు మహేష్‌కు పెళ్లై 10 ఏళ్లు యింది. అయితే, తాగుబోతు కావడం, ఉద్యోగం లేకపోవడంతో అతడి భార్య, ఇద్దరు పిల్లలు మహేష్‌ను విడిచి వెళ్లారు. ఇటీవలే వారీకి విడాకులు మంజూరైనట్లు తేలింది. ఒంటరిగా జీవిస్తున్న మహేష్, తరుచుగా భోజనం చేయడానికి దగ్గర్లోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేవాడు. ఆగస్టు 25వ తేదీ రాత్రి మద్యం మత్తులో తల్లిదండ్రుల ఇంటికి వచ్చినట్లు సమాచారం.

ఇంటికి వచ్చిన మహేష్ తనకు మటన్ కూర కావాలని, వండాలని కోరాడు. అయితే, శ్రావణ మాసం కావడంతో మాంసాహారం వద్దని వారు చెప్పారు. దీంతో మహేష్ తన తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. వివాదం పెద్దది కావడంతో మహేష్ తండ్రి భగవాన్ సూర్యభాన్ గైక్వాడ్ అతడి ముఖం, తలపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన మహేష్ పరిస్థితి విషమించి మరణించాడు. దాడి తర్వాత సాక్ష్యాలు నాశనం చేయడానికి రక్తపు మరకల్ని ఇద్దరూ తుడిచేశారు. ఈ కేసులో తండ్రిని, సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించినందుకు తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు.