NTV Telugu Site icon

Fake IAS: ఐఏఎస్‌ అని చెప్పి పెళ్లి.. భార్యను నమ్మించి రూ.2 కోట్లు వసూలు చేశాడు..!

Fake Ias

Fake Ias

Fake IAS: ఈ మధ్యకాలంలో మోసం చేసి వివాహాలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. తాను పెద్ద కంపెనీలో పని చేస్తున్నానని, విదేశాల్లో కొలువులు అని, సాఫ్ట్‌వేర్‌ అని చెప్పి భారీ మొత్తంలో కట్న కానుకలు తీసుకొని మోసం చేస్తున్న కేసులు అనేకం వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ ప్రబుద్ధుడు తాను ఐఏఎస్ ఆఫీసర్‌ని అంటూ యువతిని బురిడీ కొట్టించి పెళ్లి చేసుకోవడంతో పాటు.. ఆమె వద్ద నుంచి రూ.2 కోట్లు వసూలు చేశాడు. మళ్లీ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

Read Also: Praneeth Hanumanthu: ప్రణీత్ హనుమంతుపై ఏయే సెక్షన్ల కింద కేసు పెట్టారో తెలుసా?

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాజలింగాలకు చెందిన నల్లమోతు సందీప్‌కుమార్(38) కర్ణాటక ఐఏఎస్ క్యాడర్‌లో ఎంపికైనట్లు 2016లో ఊరంతా గొప్పగా చెప్పుకొన్నాడు. ఐఏఎస్‌ను అంటూ ఓ మ్యాట్రిమోనీలో వివరాలను నమోదు చేశాడు. ఇది చూసి.. బెల్జియంలో ఉద్యోగం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అరిమిల్లి శ్రావణి(34) కుటుంబీకులు అతడిని సంప్రదించారు. రూ.50 లక్షల కట్నం, ఇతర లాంచనాలు ఇచ్చి 2018లో పెళ్లి చేశారు. తనకు ఐఏఎస్ అధికారిగా పనిచేయడం ఇష్టం లేదని, రేడియాలజిస్టుగా ఉద్యోగం చేస్తానని భార్యకు చెప్పి నిత్యం విధులకు వెళ్లి వస్తున్నట్లు నమ్మించాడు. ప్రస్తుతం మల్లంపేట గ్రీన్‌వ్యాలీ రోడ్డులో దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Read Also: Reels: రీల్స్ పిచ్చితో ముగ్గురు యువకులు బలి.. బస్సును ఢీకొని మృతి

సంపాదనంతా ఏదని భార్య నిలదీస్తే వైద్యం ద్వారా తాను రూ.40 కోట్లు సంపాదించానని, ఆదాయపన్ను చెల్లించకపోవడంతో అధికారులు బ్యాంకు ఖాతాను సీజ్‌ చేసినట్లు చెప్పి ఆమెను నమ్మించాడు. ఆ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు రావాలంటే రావాలంటే రూ.2 కోట్లు చెల్లించాలని ఆమెతో చెప్పాడు.ఇది నమ్మిన భార్య మిత్రుల ద్వారా ఆ డబ్బును సమకూర్చింది. ఆ డబ్బును సందీప్ కుమార్ తన తండ్రి విజయ్‌ కుమార్‌ (70), అమెరికాలో ఉంటున్న సోదరి మోతుకూరి లక్ష్మీసాహితి(35) ఖాతాలకు బదిలీ చేశాడు. వివాహ సమయంలో ఇచ్చిన ఆభరణాలను తల్లి మాలతి(59) బ్యాంకులో తనఖా పెట్టి డబ్బు తీసుకుంది. భర్త ఐఏఎస్ ధ్రువపత్రంతో పాటు రేడియాలజీ సర్టిఫికెట్ నకిలీవని శ్రావణి గుర్తించింది. ఇంత జరిగినా అదనపు కట్నం కావాలని సందీప్‌కుమార్ వేధిస్తుండడంతో ఆమె బాచుపల్లి పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడితోపాటు అతడి తల్లిదండ్రులను బుధవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. మరో నిందితురాలు లక్ష్మీసాహితీ పరారీలో ఉన్నట్లు సీఐ వెల్లడించారు.