సైబర్ నేరగాళ్లకు కొంత మంది కంత్రీగాళ్లు.. మ్యూల్ ఖాతాలు సమకూర్చుతున్నారు. వాటి ద్వారా సైబర్ క్రిమినల్స్.. తాము నేరాల్లో సంపాదించిన డబ్బును మళ్లించి.. చివరికి తమ ఖాతాలకు బదిలీ చేసుకుంటున్నారు. ఫలితంగా సైబర్ నేరం జరిగినా.. అసలైన నేరస్తులను పట్టుకునేందుకు పోలీసులకు సమయం పడుతోంది. ఈ క్రమంలో పోలీసులు ఆపరేషన్ క్రాక్ డౌన్ పేరుతో సెర్చింగ్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో రూ. 31 కోట్ల లావాదేవీలు జరిగిన మ్యూల్ ఖాతాలను గుర్తించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
సైబర్ కేటుగాళ్లు.. కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. మ్యూల్ ఖాతాలతో మాయ చేస్తూ.. కోట్లు కొల్లగొడతున్నారు. తాజాగా మ్యూల్ ఖాతాల వ్యవహారం నిజామాబాద్ను కుదిపేసింది. మ్యూల్ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న ఐదుగురు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా 3 నెలల్లోనే 31 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్లో మరికొంత మంది హస్తం ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం రెంజల్ బేస్లో డ్రైవర్గా పనిచేసే మహమ్మద్ అజర్ .. పండ్ల వ్యాపారి మహమ్మద్ మినాజ్ అహ్మద్, బోధన్లోని ఏక చక్రనగర్కు చెందిన నవీన్, షర్బతి కాలువకు చెందిన మొబైల్ దుకాణం నిర్వాహకుడు సయ్యద్ హఫీజ్, ఉద్మిర్ గల్లీకి చెందిన ఖాసీం పటేల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా నకిలీ ధ్రువపత్రాలు, వివిధ ఫోన్ నెంబర్ల ద్వారా నకిలీ ఖాతాలు తెరిచి సైబర్ నేరగాళ్లకు అమ్మినట్లు గుర్తించారు. ఇతరులు అక్రమంగా సంపాదించిన డబ్బును, తమ బ్యాంక్ ఖాతాలో వేయించుకుని దాన్ని మళ్లీ ఇతరుల ఖాతాలకు పంపించే వ్యక్తి ఖాతానే మ్యూల్ ఖాతా అంటారని పోలీసులు తెలిపారు. ఇలా చేయడం ద్వారా సైబర్ ఫ్రాడ్ ద్వారా దోచుకున్న డబ్బు… మొదట ఏ ఖాతాలో పడిందో వారిపై చర్యలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. డబ్బుల కోసం ఆశపడి మోసపోవద్దని సూచిస్తున్నారు.
Also Read:Catering: క్యాటరింగ్ బిజినెస్ మాటున పెద్ద కథే నడిపిస్తున్నాడుగా..
మరోవైపు మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. అధిక లాభాల ఆశచూపి అమాయకులను ముంచేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ కేసులో 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారంతా పెట్టుబడుల పేరుతో.. అమాయకులను నమ్మించి ఏకంగా రూ. 36 లక్షలకు పైగా సొమ్ము దోచుకున్నట్లు సైబర్ పోలీసులు గుర్తించారు. ఈ నిందితులను ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి భారీగా ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అంతే కాదు వారి వద్ద నుంచి 45 మొబైల్ ఫోన్లు, 22 చెక్ బుక్కులు, 40 ఏటీఎం కార్డులు, 20 సిమ్ కార్డులు, ల్యాప్ టాప్లు, రూటర్లు స్వాధీనం చేసుకున్నారు.
డబ్బులు ఊరికేనే రావు.. అనేది అందరూ గుర్తు పెట్టుకోవాలి. అలా డబ్బులు ఊరికేనే వస్తాయని ఎవరైనా చెబితే కచ్చితంగా దాని వెనుక సైబర్ మోసం దాగి ఉంటుందని గుర్తు పెట్టుకోవాలంటున్నారు పోలీసులు. ఇక ఎవరైనా సైబర్ నేరగాళ్లకు తమ ఖాతాలు ఇస్తే జైలుకు వెళ్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
