Love Couple Attacked: ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులపై నడిరోడ్డుపై దాడి జరగడం తిరుపతిలో కలకలం రేపింది. రక్షణ కల్పించాలని కోరుతూ తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్తున్న సమయంలోనే యువతి కుటుంబ సభ్యులు వారిని అడ్డగించి దాడి చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో యువతి మెడలోని తాళిబొట్టును తెంచడంతో పాటు యువకుడు చందుపై దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. భయాందోళనలకు గురైన నవ దంపతులు సమీపంలోని ఓ కార్యాలయంలోకి పరుగెత్తి ఆశ్రయం పొందారు. స్థానికుల సహాయంతో వారిని ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించారు.
అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం కేకల దొడ్డిపల్లికి చెందిన శివస్నేహ, సూళ్లూరుపేట మండలం మతిమూడి గ్రామానికి చెందిన చందు కోచింగ్ సెంటర్లో పరిచయం అయ్యారు.. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.. పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది.. ఈ నెల 19న ఆలయంలో వివాహం చేసుకున్నారు. అయితే శివస్నేహ కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు రాయచోటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా చందు తల్లి, పెద్దమ్మ, మేనమామలను మూడు రోజుల క్రితం పోలీసులు తీసుకెళ్లారని చందు ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వస్తుండగానే తమపై దాడి జరిగిందని నవ దంపతులు వాపోయారు. ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు నవ వధువు స్టేట్మెంట్ నమోదు చేసి రాయచోటి పోలీసులకు సమాచారం అందించారు..

