పిల్లలు కావాలని ప్రతి జంట ఆశపడుతోంది. భార్యాభర్తల బంధం నుంచి తల్లిదండ్రులుగా మారాలని కోరుకుంటారు. పిల్లల కోసం పూజలు, వ్రతాలూ చేస్తారు. పుట్టకపోతే చిన్నారులను దత్తత తీసుకుంటారు. ఇక్కడి వరకు ఓకే.. కానీ, ఇక్కడ ఒక జంట పిల్లల కోసం దారుణానికి పాల్పడింది. పిల్లల కోసం ఒక మహిళను 16 నెలలు బంధించి చిత్రహింసలు పెట్టిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. ఉజ్జయినీలోని కధ్ బరోడా గ్రామ మాజీ ఉప సర్పంచ్ రాజ్పాల్ సింగ్ కి కొన్నేళ్ల క్రితం ఒక మహిళతో వివాహమైంది.. వారికి ఇద్దరు పిల్లలు. ఎంతో సంతోషంగా ఉండే వారి జీవితంలో విషాదం నిండుకుంది. ఇద్దరు పిల్లలు అనారోగ్యం కారణంగా మృతిచెందారు. దీంతో వారు ఒంటరైపోయారు. ఎలాగైనా తమకు పిల్లలు కావాలని ఒక దారుణమైన పని చేశారు. రాజ్పాల్ సింగ్ మధ్యవర్తుల సాయంతో 16 నెలల కిందట ఓ మహిళను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చాడు.
భార్య సహాయంతో ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసి, బిడ్డను కనాలని బలవంతం చేశారు. 9 నెలల క్రితం ఆ మహిళ గర్భవతి అయ్యి.. ఇటీవల ఒక బిడ్డను ప్రసవించింది. బిడ్డను ప్రసవించిన తరువాత స్పృహలేని ఆమెను బస్టాండ్లో వదిలి పరారయ్యాడు. స్పృహలోకి వచ్చిన మహిళ తన బిడ్డ కావాలని పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
