Nayeem Murder: హైదరాబాద్లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రౌడీషీటర్ మహమ్మద్ నయీమ్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉన్నట్లు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు రౌడీషీటర్ ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్తో పాటు మరో ఐదుగురు ఈ హత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు.
నాగోల్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్నగర్ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి ఈ దారుణ హత్య చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన పాత నేరస్తుడు, రౌడీషీటర్ మహమ్మద్ నయీమ్ను దుండగులు వెంటాడి హత్య చేశారు. ప్రాణభయంతో నయీమ్ సమీపంలోని ఓ మద్యం దుకాణంలోకి పరుగెత్తి వెళ్లగా.. నిందితులు వేట కొడవళ్లు, కత్తులతో లోపలికి చొరబడి అందరూ చూస్తుండగానే అతడిపై దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.
హత్య అనంతరం నిందితులు కారులో అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న నాగోల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. హత్యలో ఆరుగురు పాల్గొన్నట్లు గుర్తించారు. మహమ్మద్ నయీమ్, ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్ ఇద్దరూ ఇల్లెందుకు చెందినవారేనని.. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులని పోలీసులు గుర్తించారు. అయితే సెటిల్మెంట్లకు సంబంధించిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా ఇద్దరి మధ్య విభేదాలు, ముఠా కక్షలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరిపై ఇప్పటికే పలు హత్య కేసులు ఉండటంతో పాటు ఇల్లెందు పోలీస్ స్టేషన్లో రౌడీషీట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ పాత కక్షల నేపథ్యంలోనే నయీమ్ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. మరోవైపు మల్కాజ్గిరి సీసీఎస్ పోలీసులు ఉమామహేశ్వర్తో పాటు మరో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, వాహనం, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

