ప్రియుడి మోజులో పడి భర్తను చంపేసింది.. కానీ అంతకు ముందే ఆ ఇల్లాలు వేసిన ప్లాన్ మామూలుగా లేదు. భర్తను చంపేసే ముందే అతనికి ఏకంగా 3 కోట్ల రూపాయల బీమా చేయించిందంటే.. ఆ కిలాడీ లేడీ తెలివి తేటలను ఏమనుకోవాలి? పైగా భర్తను సుపారీ కిల్లర్స్తో హత్య చేయించిన ఆ ఇల్లాలు.. దాన్ని కూడా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అలాంటి ఖతర్నాక్ వైఫ్ గురించిన తెలిసుకున్న పోలీసులు.. ‘ఎవరమ్మా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావ్’ అంటూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ క్రిమినల్ వైఫ్ ఎవరు? ఈ ఘటన ఎక్కడ జరిగింది?
భర్త, పిల్లలు.. చక్కని సంసారం ఉండగానే కొంత మంది భార్యలు పక్కదారి పడుతున్నారు. ప్రియుడి మోజులో పడి.. సంసారాలను ఆగమాగం చేసుకుంటున్నారు. ఏకంగా భర్తను చంపేసి.. పోలీసులకు దొరికిపోతున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ వెలుగు చూశాయి. భర్తను చంపేస్తే.. నేరస్తురాలవుతానని తెలిసినా.. ఆమాయకత్వమో తెలివిలేనితనమో తెలియదు కానీ.. మళ్లీ అదే తప్పు చేస్తూ దొరికిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది.
దంపతుల పేర్లు సాయిని కుమార్, ఆయన భార్య భారతి. మంచిర్యాల జిల్లా హాజీపూర్ వారి స్వస్థలం. ఇద్దరూ చక్కగా కాపురం చేసుకుంటున్నారు. కానీ వారి కాపురంలోకి మూడో వ్యక్తి ప్రవేశించాడు. భారతికి లగిశెట్టి సురేందర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొంతకాలం నుంచి అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం భర్త సాయిని కుమార్కు తెలియడంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త కుమార్పై కక్ష కట్టింది భార్య భారతి. అతన్ని హత్య చేయించాలని భారతి నిర్ణయించింది. ప్రియుడు సురేందర్తో కలిసి పథకం వేసింది. వారు సాయిని కుమార్ పేరిట ఏడాది క్రితం రూ.3 కోట్ల మేర జీవిత బీమా పాలసీలు చేయించారు.
గతంలో డబ్బుల విషయంలో కుమార్కు, రామ్ మల్లేశ్ అనే వ్యక్తికి మధ్య గొడవలు ఉన్న నేపథ్యంలో.. కుమార్ను అడ్డు తొలగించుకునేందుకు మల్లేశ్ను సంప్రదించారు. రూ.10 లక్షలు ఇచ్చేందుకు సుపారీ మాట్లాడుకున్నారు. ఏప్రిల్లో రూ.2 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చారు. మల్లేశ్ తన స్నేహితుడు శ్రీరామ్కుమార్తో కలిసి హత్యకు ప్రణాళిక వేశాడు. ఇద్దరూ కలిసి మే 22న మద్యం తాగుదామంటూ సాయిని కుమార్ను సమీపంలోని ముల్కల్ల గ్రామ శివారుకు తీసుకెళ్లారు. సాయిని కుమార్ మద్యం మత్తులో ఉండగా.. ఇనుప సుత్తెతో తలపై మోది హత్య చేశారు. దీనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు సాయిని కుమార్ మృతదేహాన్ని, ఆయన బైక్ను రోడ్డుపై పెట్టేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సాయిని కుమార్ది హత్యగా గుర్తించారు. నిందితులు రామ్ మల్లేశ్, శ్రీరామ్కుమార్, సాయిని భారతి, లగిశెట్టి సురేందర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద హత్యకు ఉపయోగించిన సుత్తి, రూ.25వేల నగదు, ఓ ద్విచక్ర వాహనం, ఎల్ఐసీ ఎండోమెంట్, జీవన్లాభ్, జనరల్ బీమా పాలసీలు, ఎస్బీఐ టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
మొత్తంగా.. వన్ షాట్ టు బర్డ్స్ అని ఆలోచించింది భారతి. మొగున్ని చంపేస్తే.. బీమా డబ్బులు కూడా వస్తాయని వేసిన కన్నింగ్ స్కెచ్ బెడిసి కొట్టింది.
