NTV Telugu Site icon

UP: యూపీలో దారుణం.. మేనకోడలు మరొకర్ని పెళ్లి చేసుకుంటుందని హత్య

Upmurder

Upmurder

దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఏదొక చోట మహిళలు బలైపోతున్నారు. ఇప్పటికే మహిళలపై అత్యాచారాలు చేసి ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా యూపీలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఏకంగా 22 ఏళ్ల మేనకోడలను చంపేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన హర్దోయ్‌లో జరిగింది.

వరుసకు మేనకోడలైన 22 ఏళ్ల మాన్సీ పాండే అనే యువతితో రెండేళ్ల నుంచి మణికాంత్ ద్వివేది అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఈ మధ్య ఆమె మరొకరిని పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. దీంతో మణికాంత్.. ఆమెపై పగ పెట్టుకున్నాడు. అంతే అదునుచూసి ఆమెను అంతమొందించాడు. అనంతరం నిర్మాణంలో ఉన్న భవనంలో మృతదేహాన్ని పడేశాడు. పోలీసులను తప్పు దోవ పట్టించేందుకు ఆమె సెల్‌ఫోన్‌ను బస్సులో విసిరేశాడు.

మాన్సీ పాండే కనిపించడం లేదని ఆమె తండ్రి రాంసాగర్ పాండేకు మణికాంత్ ఫోన్ చేసి చెప్పాడు. అయితే రాంసాగర్‌కు మణికాంత్‌పై అనుమానం కలిగింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రక్షాబంధన్ రోజున అనగా.. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మణికాంత్‌ ఇంటి దగ్గర మాన్సీని దింపినట్లు బాధితురాలి తండ్రి రాంసాగర్‌ పాండే తెలిపాడు. ‘‘మేము మా స్వగ్రామానికి వెళ్ళాము. తరువాత నేను లక్నో వెళ్ళాను. బుధవారం అతను (మణికాంత్) నాకు ఫోన్ చేసి.. మాన్సీ కనిపించడంలేదని మరియు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పాడు. మాన్సీ పారిపోయిందని అతను నాకు చెప్పాడు, కానీ నేను అతనిని అనుమానించి..పోలీసులకు ఫిర్యాదు చేశాను.’’ అని రాంసాగర్ తెలిపాడు.

పోలీసులు కేసు నమోదు చేసి మణికాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ జరిపారు. దీంతో నిందితుడు మణికాంత్ నేరాన్ని అంగీకరించాడు. మాన్సీతో తనకు రెండేళ్ల నుంచి సంబంధం ఉందని.. అయితే తాను వేరొకరని పెళ్లి చేసుకోబోతుందని చెప్పిందన్నాడు. ఆ కోపంతో ఆమెను చంపేసినట్లు తెలిపాడు. మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న భవనంలో పడేసి.. ఫోన్‌ను బస్సులో పడేసినట్లు తెలిపాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.