Hyderabad Crime : మల్కాజ్‌గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!

  • కుటుంబ కలహాలే కాల్పులకు కారణమా?
  • మారుతీ నగర్‌లో మహిళపై విచక్షణారహితంగా కాల్పులు
  • స్నేహితుడితో కలిసి బైక్‌పై పరారైన నిందితుడు
  • పాతబస్తీ ఆయుధాల ముఠాతో లింకులపై పోలీసుల దర్యాప్తు
Gun Shooting

Gun Shooting

Hyderabad Crime : నగరంలోని మల్కాజ్‌గిరి పరిధిలో గల మారుతీ నగర్‌లో ఘోరమైన కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఒక వ్యక్తి తన భార్యపై తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మల్కాజ్‌గిరి మారుతీ నగర్‌కు చెందిన ఉషారాణి, ఆమె భర్త అరుణ్ మధ్య గత కొంతకాలంగా తీవ్రమైన కుటుంబ విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో మనస్పర్థలు ముదరడంతో, భార్యపై పగ పెంచుకున్న అరుణ్ ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అరుణ్, పాతబస్తీకి చెందిన తన స్నేహితుల ద్వారా ఒక తుపాకీని కొనుగోలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పక్కా ప్రణాళికతో తన స్నేహితుడితో కలిసి వచ్చిన అరుణ్, మారుతీ నగర్‌లో ఉషారాణిపై ఒక్కసారిగా భారీగా కాల్పులు జరిపాడు.

×
×
Ad

ఈ దారుణానికి ఒడిగట్టిన అనంతరం అరుణ్, అతనికి సహకరించిన మరో వ్యక్తి ఇద్దరూ కలిసి ఘటనా స్థలం నుండి బైక్‌పై వేగంగా పారిపోయారు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాతబస్తీలోని ఆయుధాల ముఠాతో అరుణ్‌కు ఉన్న లింకులపై కూడా పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలే ఈ కాల్పులకు దారితీసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.