Tragedy: దమ్ముంటే హైదరాబాద్కు రమ్మన్నాడు.. నిజంగానే వచ్చి చంపేశారు.. ఏం జరిగిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్లో ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో వేధించాడు.. దీంతో యువతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.. కానీ దమ్ముంటే హైదరాబాద్ రండి అంటూ సవాల్ విసిరి వచ్చాడు.. సీన్ కట్ చేస్తే.. యువతి కుటుంబ సభ్యులు.. హైదరాబాద్కు వచ్చి మరీ అతన్ని మర్డర్ చేసేశారు. అసలు ఈ కేసులో ఏం జరిగింది? ఆ యువకుడు ఎవరు? జరిగింది పరువు హత్యా? ప్రతీకారంలో భాగంగా చంపేశారా?
ఈ మర్డర్కు ప్రేమ పేరుతో వేధింపులేనని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వరంగల్ నుంచి వచ్చిన భాస్కర్.. వచ్చే సమయంలో దమ్ముంటే హైదరాబాద్కు రండి అని సవాల్ విసిరాడని.. ఆ సవాల్లో భాగంగా వచ్చి చంపేశారని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఐటీ హబ్ మాదాపూర్లో.. ప్రేమ వ్యవహారం.. వివాదాస్పదంగా మారి ఓ యువకుడి దారుణ హత్యకు దారితీసింది. రామేశ్వరం కేఫ్ ఎదుట జరిగిన ఈ ఘటన నగరంలో ఒక్కసారిగా కలకలం రేపింది.
Also Read
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సీనపల్లి భాస్కర్పై ఇద్దరు వ్యక్తులు కర్రలు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం నిందితులిద్దరూ నేరుగా మాదాపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. భాస్కర్.. మాదాపూర్లోని ఓ హోటల్లో కుక్గా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. మంగళవారం అర్ధరాత్రి రామేశ్వరం కేఫ్ సమీపంలో అతడిని అడ్డగించిన తమ్మెడబోయిన రాజు, మారం కుమారస్వామి కత్తులు, కర్రలతో దాడి చేశారు. తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
హైదరాబాద్కు వచ్చి పథకం ప్రకారం దాడి..
భాస్కర్ ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో వేధించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై గతంలో వరంగల్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఐతే ఇరు వర్గాలకు కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు పోలీసులు. అయినప్పటికీ వివాదం కొనసాగిందని పోలీసులు చెబుతున్నారు. అనంతరం భాస్కర్ “దమ్ముంటే హైదరాబాద్కు రండి” అంటూ సవాల్ విసిరినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన యువతుల తండ్రి తన బంధువుతో కలిసి హైదరాబాద్కు వచ్చి పథకం ప్రకారం దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే ఈ కేసులో మరో కోణాన్ని మృతుడు భాస్కర్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భాస్కర్, ఓ యువతి పరస్పర అంగీకారంతో ప్రేమించుకున్నారని.. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని వారు చెబుతున్నారు. యువతి కుటుంబ సభ్యులు కులాంతర వివాహానికి వ్యతిరేకించారని, గతంలోనే చంపేస్తామని బెదిరించారని ఆరోపిస్తున్నారు. వేధింపులు, వెంటపడడం వంటి ఆరోపణల్లో నిజం లేదని, ఈ హత్య పరువు, కుల వివక్ష కారణంగానే జరిగిందని భాస్కర్ కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రేమ, వేధింపుల ఆరోపణలు, కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రేమ, కుల వివాదం ఆరోపణలు సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాతే హత్యకు దారితీసిన అసలు కారణాలు స్పష్టమయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. ‘వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు’!
-
HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
-
HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr
-
Shabad Serial Killer: ఆరుగురిని హత్య చేసిన షాబాద్ సైకో కిల్లర్.. కథ ఇక్కడితో ముగియలేదు!
-
Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!