Kerala: తాత హత్యకు 13 ఏళ్ల బాలిక కుట్ర.. వీడియో కాల్‌లో హత్యను చూస్తూ!

  • తాత హత్యకు కుట్ర పన్ని హతమార్చిన 13 ఏళ్ల బాలిక..
  • కేరలో సంచలనంగా మారిన హత్య కేసు..
  • నిందితులంతా మైనర్లే..
Crime

Crime

Kerala: కేరళలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. సొంత తాత హత్యకు 13 ఏళ్ల బాలిక కుట్ర పన్నింది. టీనేజర్లతో కలిసి తాతను హతమార్చింది. హత్యను వీడియో కాల్‌లో చూసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆగస్టు 15 రాత్రి 67 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఈ హత్య జరిగింది. అలప్పుజాకు చెందిన బాలిక తన 17 ఏళ్ల స్నేహితుడు, మరో ముగ్గురు టీనేజర్లతో కలసి కుట్ర పన్నినట్లు తేలింది. వీరంతా బాత్‌రూమ్ వెంటిలేటర్ ద్వారా ఇంట్లోకి ప్రవేశించారు. బాలిక వారితో వీడియో‌కాల్‌లో మాట్లాడుతూ.. ఇంట్లోకి ప్రవేశించే మార్గాన్ని సూచించినట్లు పోలీసులు తెలిపారు.

ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మైనర్ నిందితులు వృద్ధుడి చేతులు, కాళ్లను కట్టేసి, ఆయన నోట్లో గుడ్డను కుక్కి, తలను బలంగా గోడకు కొట్టి దాడి చేశారు. చివరకు ఉగడ్డతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మొత్తం హత్యను బాలిక వీడియో కాల్‌లో లైవ్‌లో వీక్షించినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదికలో ఊపిరాడకపోవడమే మరణానికి కారణమని తేలింది. వృద్ధుడి శరీరంపై పలు గాయాలు ఉన్నట్లు తేలింది. హత్య తర్వాత నిందితులు సుమారు 4.5 సవర్ల బంగారాన్ని తీసుకెళ్లారు. ఆ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తాత హత్య జరిగినప్పటికీ బాలిక ప్రవర్తన నార్మల్‌గా ఉండటంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. ఆగస్టు 16న ఆమె చిన్న పిల్లలతో కలిసి సమీపంలోని దుకాణానికి రెండుసార్లు వెళ్లి చిప్స్ ప్యాకెట్స్ కొనుగోలు చేసింది. మరుసటి రోజు ఉదయం తన తాత తలుపులు తీయడం లేదని స్థానికులకు చెప్పింది. ఆయన మద్యం తాగి నిద్రపోతున్నట్లు ఓ దుకాణదారుడికి చెప్పినట్లు తెలుస్తోంది. చివరకు ఇంటి తలుపులు తెరిచినప్పుడు వృద్ధుడు మరణించి కనిపించాడు. అయినా, బాలిక తన స్కూల్ యూనిఫాం ధరించి పరీక్ష ఉందని వెళ్లేందుకు సిద్ధమవ్వడం అనుమానాస్పదంగా తోచింది.

డబ్బు, మొబైల్ కోసం కుట్ర..?

బాలిక మొబైల్ ఫోన్ కావాలని, ఆమె 17 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్ కోసం బైక్ కొనుగోలు చేసేందుకు డబ్బు అవసరమైందని దర్యాప్తులో తేలింది. టీనేజర్లు డ్రగ్స్ ఉపయోగించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో తాత తనతో అనుచితంగా ప్రవర్తించేవాడనే ఆయనపై కోపం, కక్ష పెంచుకున్నట్లు బాలిక ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు పోలసీులు తెలిపారు.

ఈ కేసులో వృద్ధుడి పోస్టుమార్టం కోసం ప్రభుత్వం మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించగా, ఆయన చిన్న కుమార్తె అదే ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నిందితులంతా బాల నేరస్తులే కావడంతో దర్యాప్తు సంక్లిష్టంగా మారింది. నిందితులందరికి 16-18 ఏళ్లే ఉండటం గమనార్హం.