Karnataka: సీన్ రివర్స్ అయింది. కర్ణాటకలో పెళ్లికి నిరాకరించాడని ఒక యువతి, తన ప్రియుడిపై దాడి చేసింది.శుక్రవారం రామనగర జిల్లాలోని బిడాడి పట్టణంలో ఈ ఘటన జరిగింది. నిందితురాలిని 30 ఏళ్ల సుధగా, బాధిత వ్యక్తిని 27 ఏళ్ల వేణు గోపాల్గా గుర్తించారు. ఈ ఘటన తర్వాత సుధను పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. సుధ తనను పెళ్లి చేసుకోవాలని వేణుగోపాల్ను కోరగా, అతను కొంత కాలంగా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో అతడిపై సుధ కోపం పెంచుకుంది. గురువారం రాత్రి వీరిద్దరి మధ్య ఇదే విషయమై మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సుధ తనతో తెచ్చుకున్న కత్తితో వేణుగోపాల్పై దాడికి పాల్పడింది. అతడి ఛాతీ, కడుపు, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.
వేణు గోపాల్ బిడాడితో మ్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు, సుధ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వారు జిమ్లో కలుసుకున్నారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దాదాపుగా ఏడాది కాలంగా ఇద్దరు రిలేషన్లో ఉన్నారు. సుధ వేణు గోపాల్ ఇంటికి కూడా వెళ్లేది. అయితే, గత 4 నెలలుగా వేణు సుధకు దూరంగా ఉంటున్నాడు. ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడు. అతను వేరే మహిళతో తిరుగుతున్నట్లు సుధకు తెలిసింది. దీంతోనే వేణుపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ప్లాన్ ప్రకారమే దాడి చేయడానికి ఒక కత్తిని తన బ్యాగ్లో సుధ ఉంచుకుని తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి ఆమె వేణుగోపాల్ను ఇంటి నుంచి బయటకు రావాలని కోరింది. అతను వచ్చిన సమయంలోనే ఆమె దాడికి పాల్పడింది. దాడి తర్వాత వేణు అక్కడికక్కడే కుప్పకూలాడు. మొబైల్ ద్వారా తన కుటుంబీలకు ఫోన్ చేయగలిగాడు, వారు అతడిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. సుధను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు.