HYD ATM DONGALU: ATMలో కాల్పులు జరిపి అలజడి సృష్టించిన ఇద్దరు దొంగలు దొరికేశారు. అటు ఏటీఎంలలో క్యాష్ నింపే ఉద్యోగం చేస్తూ డబ్బు కొట్టేసిన కేటుగాడ్నీ పోలీసులు పట్టుకున్నారు. ఈ రెండు కేసుల్లో భారీగా క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కోఠిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం సమీపంలోని ఏటీఎం వద్ద జరిగిన కాల్పులు.. ఆ తర్వాత జరిగిన దోపిడీ కేసును టాస్క్ఫోర్స్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ ఘటనలో పాల్గొన్న నిందితులను ఇతర రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలించి.. యూపీలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు ఉపయోగించిన తుపాకీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జనవరి 31న ఉదయం 7 గంటల ప్రాంతంలో కేరళకు చెందిన వ్యాపారి రిన్షాద్ డబ్బులు డిపాజిట్ చేసేందుకు కోఠి ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లాడు. అతన్ని ముందుగానే ఫాలో అయిన ఇద్దరు దుండగులు ముసుగులు ధరించి ఏటీఎంలోకి ప్రవేశించారు. రిన్షాద్ రూ.6 లక్షలు డిపాజిట్ చేస్తున్న సమయంలో అతనిపై కాల్పులు జరిపి, డబ్బులతో ఉన్న బ్యాగ్ను లాక్కొని బైక్పై పారిపోయారు. ఈ ఘటనలో ఒక బుల్లెట్ బాధితుడి కాలులోకి దూసుకెళ్లింది. మరో బుల్లెట్ మిస్ఫైర్ అయింది. మొత్తం ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
ఈ కేసు గతంలో సంచలనం సృష్టించింది. హైదరాబాద్ నడిబొడ్డులో కాల్పుల కలకలంతో పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. సీసీ ఫుటేజ్, టెక్నికల్ ఆధారాలతో సమగ్ర దర్యాప్తు చేశారు. ఈ కేసులో యూపీకి చెందిన A1 ఫరూక్ ఖాన్, మరో కేసులో కోర్టులో సరెండర్ అయిన A2 ఫరూక్, A3 అబీద్ను గుర్తించారు. వీరికి ఆశ్రయం కల్పించిన చాంద్రాయణగుట్టకు చెందిన A4 మహ్మద్ తయ్యబ్ త్యాగిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తుర్కాన్ అహ్మద్, ఫహీం అనే నిందితులు హైదరాబాద్కు వచ్చి కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న తయ్యబ్ త్యాగి నగరంలోని ఏటీఎం సెంటర్ల వద్ద రెక్కీ నిర్వహిస్తూ.. ఎవరెక్కడ భారీ మొత్తంలో నగదు డ్రా లేదా డిపాజిట్ చేస్తారన్న వివరాలను సేకరించి యూపీలో ఉన్న తన ముఠాకు చేరవేసేవాడు. ఆ సమాచారంతో నిందితులు నగరానికి చేరుకుని దోపిడీకి పాల్పడ్డారు. ఈ దోపిడీకి మొత్తం ఐదుగురు నిందితులు ప్రత్యక్షంగా సంబంధం ఉండగా, ఏడుగురు కలిసి కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. నిందితులందరినీ అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ కెమెరాల విశ్లేషణ ఆధారంగా కేసును ఛేదించినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: Marriage Frauds : హైదరాబాద్లో బయటపడ్డ షాదీ డాట్ కామ్ మోసగాడు, కిలేడీ పాస్టర్ లీలలు!
మరోవైపు గచ్చిబౌలిలోని గోపన్పల్లిలో భారీ నగదుతో పారిపోయిన ఏటీఎం వెహికిల్ డ్రైవర్ అజిత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 12న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం లో నగదు నింపేందుకు CMS ఉద్యోగులు ఏటీఎం సెంటర్లోకి వెళ్లారు. అదును చూసి నగదుతో ఉన్న వాహనంతో పరారయ్యాడు అజిత్ . ఇద్దరు కస్టోడియన్లు బ్యాంక్ లోపల నగదు నింపే పనిలో ఉండగా సెక్యూరిటీ గార్డు వాష్రూమ్కు వెళ్లారు .అదే సమయంలో డ్రైవర్ అజిత్ అలియాస్ శివ సుమారు రూ. 57 లక్షల నగదుతో సహా వాహనం తీసుకుని పరారయ్యాడు. నిందితుడు వాహనాన్ని తెల్లాపూర్ సమీపంలో వదిలేశాడు. లోపల ఉన్న రూ. 57 లక్షల నగదుతో పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. CMS ట్రాన్సిట్ వెహికల్ డ్రైవర్ అజిత్ అలియాస్ శివను అరెస్టు చేసేందుకు సాంకేతిక ఆధారాలతో పాటు సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతపురంలో ఉన్నట్టు కనుగొని CCS పోలీసులు అక్కడ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అజిత్ అలియాస్ శివ వద్ద నుంచి రూ.27 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మాదాపూర్ సిసిఎస్ పోలీసులు శివను అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు.
