Hyderabad Crime: హైదరాబాద్లో రోజు రోజుకు ఆకతాయిల ఆగడాలు పెరుగుతున్నాయి. గంజాయి మత్తులో అమాయకుల పై దాడులు చేస్తున్నారు.. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే, దాడులు చేస్తున్నారు.. రౌడీషీటర్ల అనుచరులమని, తాము ఏం చేసినా అడిగేవాడు లేడంటూ ఇష్టానుసారంగా దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చాధర్ఘాట్లో ఇలాంటి ఘటనే జరిగింది. మరోవైపు మత్తు ఇంజక్షన్లు అమ్ముతున్న ముఠాను కూడా ఛాదర్ఘాట్ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.
Tamil Nadu: ఉచితంగా ఫ్రిజ్.. పురుషులకు బస్ ఫ్రీ.. అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల
గంజాయి.. ఇతర మత్తు పదార్థాలు హైదరాబాద్లో చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. యువత.. గంజాయితోపాటు ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. పాన్ డబ్బాలలోనే కాదు.. ఎక్కడపడితే అక్కడ గంజాయి సహా డ్రగ్స్ లభిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు మత్తు పదార్థాలు తీసుకున్న తర్వాత ఆ మైకంలో పోకిరీలు నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా చాధర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చిన్న సెల్ఫోన్ రిపేర్ షాప్పై దాడికి పాల్పడ్డారు. అది కూడా కేవలం 50 రూపాయల విలువ చేసే స్క్రీన్ గార్డ్ విషయమై నెలకొన్న వివాదం.. షాపు ఓనర్పై దాడికి దారి తీసింది. అంతటితో ఆగకుండా అతని షాప్లోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు గంజాయి బ్యాచ్.
అర్భాజ్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి చాధర్ఘాట్లోని ఓ సెల్ఫోన్ రిపేర్ షాపు దగ్గరికి వచ్చాడు. అక్కడ ఫోన్కు స్క్రీన్ గార్డ్ వేయాలని కోరాడు. 50 నుంచి 60 రూపాయలు అవుతుందని.. సెల్ఫోన్ నిర్వాహకుడు చెప్పడంతో.. తననే డబ్బులు అడగుతావా అంటూ షాప్ యజమానిపై దాడికి దిగారు. అర్భాజ్తో పాటు అతని స్నేహితులు షాప్ వద్ద నానా హంగామా సృష్టించారు. ఆ తరువాత కొద్ది సేపటికి అర్బాజ్, కొడవలితో షాప్ ఓనర్ పై దాడికి పాల్పడాటానికి వచ్చాడు. కొడవలితో అతని బెదిరిస్తూనే.. షాప్ ముందు ఉన్న ఫర్నీచర్ను రోడ్డుపై పడేశాడు. ఆ తరువాత అక్కడి నుండి పారిపోయాడు. తాము రౌడీషీటర్లమని.. కొంత మంది అనుచరులమని గంజాయి మత్తులో బెదిరించడమే కాకుండా తమకు మామూలు కూడా ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు.
సెల్ఫోన్ షాప్ ధ్వంసం చేసిన దృశ్యాలు సీసీ కెమరాల్లో రికార్డయ్యాయి. పోలీసులకు.. షాప్ నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదుతో గంజాయి బ్యాచ్ కోసం గాలిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ ఛాదర్ఘాట్లో నిషేధిత ఇంజెక్షన్ల విక్రయానికి పోలీసులు బ్రేక్ వేశారు. ఓ మెడికల్ షాప్లో గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పలు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు నిషేధిత ఇంజెక్షన్లను విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ టీమ్ నిఘా ఉంచింది. ఓల్డ్ మలక్పేట్కు చెందిన షేక్ సమీర్, ఛాదర్ ఘాట్కు చెందిన వాసీం ఖాన్లు చాదర్ఘాట్లోని ఓ మెడికల్ షాపు దగ్గరికి వచ్చారు. మెడికల్ షాప్ యజమానికి తమ దగ్గర మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్స్ ఉన్నాయని అతనికి చెప్పారు. బేరం కుదుర్చుకున్న తర్వాత వాటిని మెడికల్ షాప్ యజమానికి అందజేసే సమయంలో టాస్క్ఫోర్స్ టీమ్ వారిపై రైడ్ చేసింది.
షేక్ సమీర్, వాసీం ఖాన్ నుంచి 20 వాయిల్స్ నిషేధిత మెఫెంటర్మైన్ సల్ఫేట్తో పాటు మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు కోసం చాధర్ఘాట్ పోలీసులకు అప్పగించారు. విచారణలో నిషేధిత ఇంజెక్షన్లను కొరియర్ ద్వారా తెప్పించినట్లు సమీర్, వాసీంలు చెప్పారు. మజార్ అనే వ్యక్తి ఢిల్లీకి చెందిన అసీం నుంచి కొరియర్లో తెప్పించి తమకు ఇచ్చాడని.. ఇద్దరు నిందితులు పోలీసులకు తెలియజేశారు. దీంతో మజార్కు సంబంధించిన వివరాలను రాబడుతున్నారు పోలీసులు. ఈ మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లతో తీవ్ర అనర్థాలు వస్తుండటంతో.. వీటిని నిషేధించారని.. కానీ.. కొంత మంది మత్తుకోసం వీటిని వినియోగిస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. వసీం, సమీర్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.
